ఏపీలో ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే హోదా కావాల్సిందే: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్లమెంటులో వైసీపీ నేతలతో కలిసి ప్రధాని మోదీ వద్దకు వెళ్లిన జగన్ పలు అంశాలపై చర్చించారు. ప్రధానికి ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామి ప్రతిమను, శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.

భేటీ అనంతరం జగన్ మాట్లాడుతూ, ప్రధానికి అందించిన వినతి పత్రంలో ప్రత్యేకహోదా అవసరాన్ని నొక్కి చెప్పినట్టు వెల్లడించారు. ఏపీ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి హోదా ఎంతో అవసరం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

రాష్ట్రం కోలుకునే వరకు పదేళ్లపాటు జీఎస్టీ మినహాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పదేళ్ల పాటు ఆదాయపన్ను మినహాయింపులు కూడా ఇవ్వాలని తన వినతి పత్రంలో పేర్కొన్నట్టు వివరించారు.

పదేళ్లపాటు 100 శాతం బీమా ప్రీమియం రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని కూడా కోరారు. రెవెన్యూ లోటు రూపేణా రూ.22, 948 కోట్లు ఇవ్వాలని, పోలవరానికి ఖర్చు చేసిన రూ.5,103 కోట్లను రీయింబర్స్ మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

భూసేకరణ, పునరావాసానికి ఈ ఏడాది రూ.16,000 కోట్లు ఇవ్వాలని, కడప ఉక్కు పరిశ్రమకు కేంద్రం ముందుకు రావాలని సీఎం జగన్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *