ఏపీ సీఎం కుర్చీపై సరైనోడు…ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజుల పాలనలోనే దూకుడు!
అమ్మఒడి పథకం నుంచి అవినీతి సహించబోమనే హెచ్చరికల వరకు వైఎస్ జగన్ తనదైన శైలితో ముందుకు సాగుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తయ్యింది. జగన్ ఈ నెల రోజుల్లో ఎన్నో సంచలనాలకు తెరతీశారు.
1.వైఎస్ జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తి.
2.ఈ కాలంలో ఎన్నో సంచలన నిర్ణయాలు
3.ప్రజావేదిక కూల్చివేత, గత ప్రభుత్వ అవినీతిపై కమిటీ వంటివి ఉదాహరణలు
ఐదుగురు డిప్యూటీ సీఎంలు, పోలీసులకు వీక్లీ ఆఫ్ రూపంలో కొత్త ఒరవడికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, అవినీతి రహిత పాలన, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, మహిళల సంక్షేమం, గ్రామ స్వరాజ్యం..
ఇలా వివిధ రకాల పాలనాంశాల్లో తన మార్క్తో ముందుకు సాగుతున్నారు.
వైఎస్ జగన్ ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టి నెల రోజులు గడిచింది.
మే 30న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.
అక్కడి నుంచి చూస్తే ఇప్పటికే నెల రోజులు పూర్తయ్యాయి.
సీఎం కుర్చీపై సరైనోడు.. పాలనలో దూకుడు!
జగన్ నెల రోజుల పాలనలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏంటివో చూద్దాం..
✺ అమ్మఒడి పథకం జగన్ తీసుకున్న నిర్ణయాల్లో అతిముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు.
పిల్లలను స్కూల్కు పంపించే ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15,000 ఇస్తామని ప్రకటించారు.
ఇటీవలే ఈ పథకాన్ని ఇంటర్ కాలేజీలకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు.
చదువుకు జగన్ ఎంతటి ప్రాధాన్యమిస్తున్నారో ఈ పథకం తెలియజేస్తోంది.
ఇది జనవరి 26 నుంచి అమలులోకి వస్తుంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు కూడా తగిన ప్రణాళికలు రూపొందించారు.
✺ జగన్ ప్రమాణ స్వీకారం రోజు పెన్షన్ పెంపు మీద తొలి సంతకం చేశారు.
రూ.2,000 పింఛన్ను రూ.2,250కి పెంచారు. దీన్ని ప్రతి ఏటా పెంచుతూ రూ.3,000కు తీసుకెళ్తారు.
✺ ఐదుగురు డిప్యూటీ సీఎంలతో దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు.
రెండున్నరేళ్ల తర్వాత రెండో దఫా కేబినెట్ ఉంటుందని చెప్పి సంచలనం తెరతీశారు. అలాగే పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చి మరో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు.
✺ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చి.. పెద్ద సంచలనానికి తెరతీశారు.
అవినీతి ఏ స్థాయిలో ఉన్నా కూడా సహించేది లేదని హెచ్చరించారు.
✺ నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పిన జగన్.. వలసలను ప్రోత్సహించబోమని ప్రకటించి అందరి ప్రశంసలు పొందారు.
✺ అన్నదమ్ములు కలిసి ఉంటేనే బలం.
ఈ దిశగానే తెలంగాణ సీఎం కేసీఆర్తో కలసి రాష్ట్ర విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు జగన్.
✺ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా గ్రామ వాలంటీర్ల నియామకం చేపడుతున్నారు.
గ్రామాల్లో ఉండే యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అలాగే గ్రామ పంచాయతీల ఏర్పాటు కూడా జగన్ నిర్ణయాల్లో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు.
✺ ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్లో ఇసుక విధానానికి శ్రీకారం చుట్టారు.
✺ ఉగాది కానుకగా అర్హులైన మహిళలకు 25 లక్షల ఇంటి పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
✺ రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు.
అలాగే రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రూ.3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నారు.
✺ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రాధాన్యతను కేంద్రానికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే వస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను అదేశించారు.
✺ మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు పింఛన్ నెలకు రూ.10,000కు పెంచారు.
ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికుల జీతాల పెంపునకు ఆమోద ముద్ర వేశారు.
✺ గత ప్రభుత్వపు అవినీతిపై జగన్ ఉక్కుపాదం మోపారు. కేబినెట్ సబ్ కమిటీని నియమించేందుకు అంగీకారం తెలిపారు.
ఈ కేబినెట్ సబ్ కమిటీ 30 అంశాలపై విచారణ జరుపనుంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల రోజుల పాలన హిట్టా? ఫట్టా?..
జగన్మోహన్రెడ్డి పనితీరు ఎలా ఉంది? వంటి అంశాలను కేవలం నెల రోజుల పాలన ప్రాతిపదికన చెప్పడం కుదరదు.
60 నెలల పదవీ కాలానికి నెల రోజులను ప్రామాణికంగా తీసుకుని మార్కులు వేయడానికి వీల్లేదు.
అయితే అన్నం ఉడికిందా? లేదా? అని తెలుసుకునేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుందంటారు కదా?