అయోధ్య రామ మందిర నిర్మాణానికి వైసీపీ ఎంపీ తన మూడు నెలల రూ. 3.96 లక్షల జీతాన్ని విరాళంగా..

అయోధ్య రామాలయానికి వైసీపీ ఎంపీ రూ. 3.96 లక్షల విరాళం.. బీజేపీ అగ్ర నేతలను ప్రస్తావిస్తూ..
అయోధ్య రామ మందిర నిర్మాణానికి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన మూడు నెలల జీతాన్ని విరాళంగా అందజేశారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చారు.
వచ్చే నెల 5వ తేదీన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అకౌంట్కు తన విరాళాన్ని రఘురామ కృష్ణంరాజు జమ చేశారు.
రామాలయ నిర్మాణానికి ఉడతా భక్తిగా ఈ విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర చైర్మన్కు లేఖ రాశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల మంది హిందువులు రామాలయం భూమి పూజ కోసం ఎదురుచూస్తున్నారని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.
కాగా, రామాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని ట్రస్ట్ నిర్ణయించింది.
రామాలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ కూడా పాల్గొంటారని తెలిపింది.
ఆగస్టు నెలలో జరగనున్న ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖలు పాల్గొంటారని ట్రస్టు సభ్యులు వివరించారు.
కాగా, గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీల బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.
ఈ తరుణంలో బీజేపీ దగ్గరయ్యేందుకు ఎంపీ రఘురామ ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇందులో భాగంగా ఇటీవలే ప్రధాని మోదీని కీర్తిస్తూ పాటలు కూడా విడుదల చేశారు. తాజాగా, అయోధ్య రామ మందిరానికి తన మూడు నెలల జీతం విరాళాన్ని ఇచ్చిన ఎంపీ రఘురామ..
తన ట్వీట్ను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జోడించారు.