షర్మిల కేసుపై సోషల్ మీడియా వేదికగా పోరాటం మహిళలకు విజయశాంతి పిలుపు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఉదంతంపై యావత్ మహిళా లోకం సోషల్ మీడియా వేదికగానే పోరాటం చేయాలని టి పి సి సి నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పై షర్మిల చేస్తున్న ఆవేదన, సమాజంలో మహిళల దృష్టికి అద్దం పడుతోందన్నారు.
సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీల పై విషం కక్కుతున్న ఈ సంస్కృతిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఒక ప్రకటనలో విజయశాంతి పేర్కొన్నారు. రాజకీయాలలో మహిళ లను వేధింపులకు గురిచేస్తూ, పురుషాధిక్యత చాటుకునే ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి అన్నారు. ఈ తరహా ఘటనలు మహిళలను మానసికంగా మరింత కుంగదీస్తున్నాయి అన్నారు. షర్మిలకు న్యాయం జరిగే విషయంలో పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకునే విధంగా మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలన్నారు.
ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని. కొందరు రాజకీయాలను అడ్డుపెట్టుకొని మహిళ లపై దుష్ప్రచారం చేయడం భావ్యం కాదు. రాజకీయంగా ఎదుర్కోలేక భయంతో ఒక ఆడపిల్లను సోషల్ మీడియా ద్వారా లేనిపోని అభాండాలు వేయడం తగదు. 40 ఏళ్లుగా సినిమా రాజకీయ రంగాల్లో మహిళా సాధికారత కోసం పోరాడిన వ్యక్తిగా తన స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానని వెల్లడించారు.