టీఆర్‌ఎస్‌లో చేరనున్న ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆశలు గల్లంతే!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర కూడా ఆ పార్టీని వీడనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు.. శనివారం (మార్చి 2) రాత్రి సీఎం కేసీఆర్‌ను కలిశారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు సండ్ర వెంకట వీరయ్య కూడా సీఎం కేసీఆర్‌ను కలిశారు. త్వరలోనే ఆయన కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు.. మీడియాతో మాట్లాడారు.

త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అవసరమైతే శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ తరఫున తిరిగి పోటీ చేస్తామని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ నాయకత్వంలోనే ఆదివాసీల సమస్యలు తీరుతాయని.. గిరిజన ఆదివాసీల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు.

పోడు, గిరిజన సాగు భూములకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు ఆదివారమే టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తమ రాజీనామా లేఖలను కూడా పంపినట్లు సమాచారం.

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరితే.. తెలంగాణలో కాంగ్రెస్ బలం మరింత తగ్గనుంది.

అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 19 మంది సభ్యులున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే ఆ సంఖ్య 17కు పడిపోతుంది. ఇదే జరిగితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోవడం కష్టమవుతుంది.

తమకున్న బలంతో ఒక్క సీటునైనా గెలుచుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. ఈ సమయంలో ఆ పార్టీకి ఇది పిడుగు లాంటి వార్తే.

ఎన్నికల తర్వాత ఇప్పటికే ఇద్దరు స్వతంత్రులు గులాబీ గూటికి చేరడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది.

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు నాగార్జున సాగర్ ఎడమకాల్వ నుంచి నీరు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.

సండ్ర విజ్ఞప్తి మేరకు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు.

సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాల్లోని మెట్ట, ఆరుతడి పంటలకు నీరందించాలని సండ్ర కోరారు.

టీడీపీ ఎమ్మెల్యే సండ్ర టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని, ఆయనకు మంత్రి కూడా ఖాయమైందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *