ఒక్క నిమిషంలో ఫలితాలు.. ఈవీఎంలో ఓట్లను ఇలా లెక్కిస్తారు

ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను ఎలా లెక్కిస్తారు? ఒక ఈవీఎంలో ఫలితాన్ని తెలుసుకోడానికి ఎంత సమయం పడుతుంది? ఓట్ల లెక్కింపు ప్రక్రియను…

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మే 23న ఈవీఎంలో అధికారులు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. అయితే, ఈవీఎంలలో ఓట్లు ఎలా నమోదవుతాయి? వాటిని ఎలా లెక్కిస్తారు? తదితర వివరాలను తెలుసుకుందాం. (ఓట్ల లెక్కింపు ప్రక్రియను పై వీడియోలో చూడగలరు)

ఎన్నికల ప్రక్రియలో 3 రకాల ఓట్లు ఉంటాయి. అధికారులు ముందుగా సైన్యానికి సంబంధించిన సర్వీసు ఓట్లను గణిస్తారు. ఆ తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించిన పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు.

సర్వీస్, పోస్టల్.. ఈ రెండు రకాల ఓట్లు తపాలా ద్వారా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు చేరతాయి. ఉదయం 8 గంటలకు కౌటింగ్ వీటితోనే ప్రారంభమవుతుంది. వీటి లెక్కింపు పూర్తవగానే ఉదయం 8.30 గంటలకు తొలి రౌండ్‌ ఫలితం వెల్లడిస్తారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల గణన పూర్తి కాగానే.. నిఘా నీడలో ఉన్న స్ట్రాంగ్‌ రూముల తాళాల తీసి అక్కడి నుంచి ఈవీఎంలను కౌంటింగ్ జరిగే హాలులోకి తీసుకొస్తారు. అక్కడ నుంచి ఈవీఎంల కౌంటింగ్‌ మొదలవుతుంది.

20 నిమిషాలకు ఒక్కో రౌండ్ చొప్పున క్రమంగా ఫలితాలు వెల్లడిస్తారు. ఉదయం 8.50 వరకు మొదటి రౌండ్‌ (పోస్టల్ బ్యాలెట్ + ఈవీఎం) ఫలితం వస్తుంది.

కౌంటింగ్ కేంద్రంలో 14 లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. వాటికి సరిపడేట్లు వరసగా నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలను టేబుళ్లపై ఉంచుతారు.

అన్ని టేబుళ్ల వద్ద ఫలితాలు వచ్చాక వాటి మొత్తాన్ని తీసుకుని ఆ రౌండ్‌ ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. వాటన్నింటినీ తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన తర్వాత రెండో రౌండ్‌ మొదలవుతుంది.

అన్ని టేబుళ్ల లెక్కింపు పూర్తైన తర్వాత ఆ రౌండ్‌ ఫలితంపై స్పష్టత వస్తుంది. వాస్తవానికి ఒక ఈవీఎంలో ఫలితాలు ఒక్క నిమిషంలోనే తెలిసిపోతుంది. అయితే, ఒక రౌండ్‌‌లో ఫలితాలన్ని లెక్కించేందుకు 20 నిమిషాల సమయం పడుతుంది.

నియోజకవర్గాల వారీగా ఆయా ఓట్ల వివరాలను మైక్రో అబ్జర్వర్లు, పరిశీలన అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరించుకొని ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారం ఇస్తారు.

బరిలో నిలిచిన అభ్యర్థి తరఫున ఓ కౌంటింగ్‌ ఏజెంట్‌కు లెక్కింపు కేంద్రంలోకి అవకాశం ఇస్తారు. పోటీ చేసే అభ్యర్థి అభ్యర్థన మేరకు కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకానికి రిటర్నింగ్‌ అధికారి అనుమతిస్తారు.

ఓట్ల లెక్కింపు సిబ్బంది మినహా మిగతా వారెవరూ కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు.

టేబుళ్ల వెనకవైపు ఇనుప కంచె బిగిస్తారు. బల్ల ఎదురుగా కంచె అవతల వేర్వేరు పార్టీల కౌంటింగ్‌ ఏజెంట్లు కూర్చొని బయట నుంచి ఫలితాలను గమనిస్తుంటారు.

మొదట మొత్తం ఎన్ని ఓట్లకుగానూ.. ఎన్ని ఓట్లు పడ్డాయనే వివరాలను యంత్రాంగం నమోదు చేస్తుంది. చివర్లో అభ్యర్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది రాస్తారు.

మైక్రో అబ్జర్వర్‌, ఆర్వో, పరిశీలకుడు నిర్ధరించుకున్నాక ఆ రౌండ్‌ ఫలితాన్ని ప్రకటిస్తారు.

నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే ముందు సంబంధిత నియోజకవర్గంలోని ఏదైనా ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వీవీప్యాట్‌ను ఎంచుకొని అందులోని స్లిప్‌లను లెక్కిస్తారు.

వీవీప్యాట్‌ ద్వారా వచ్చిన రశీదులు, ఈవీఎంలో పడిన ఓట్లు సరిపోలాయా లేదా నిర్ధారించుకుంటారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక టేబుల్‌ ఉంటుంది.

వీవీప్యాట్‌ యంత్రంలోని స్లిప్‌లను గుర్తుల ఆధారంగా వేరు చేస్తారు. చివర్లో ఒక్కో గుర్తుకు ఎన్ని ఓట్లు పడ్డాయో గణిస్తారు. ఈ లెక్కలు ఈవీఎం ఫలితాలతో సరిపోలిన తర్వాతే చివరి రౌండ్‌ ఫలితాన్ని ఆర్వో ప్రకటిస్తారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *