టీడీపీ తొలి జాబితా అభ్యర్థుల పేర్లు తారుమారవుతున్నాయి…కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి

టీడీపీలో ఉత్కంఠ.. తొలి జాబితా అభ్యర్థుల మార్పు!
టీడీపీ తొలి జాబితా అభ్యర్థుల పేర్లు తారుమారవుతున్నాయి. మారుతున్న సమీకరణలతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. పెండింగ్ స్థానాలపై తీవ్రమైన కసరత్తు జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీలో మారుతున్న సమీకరణలతో అభ్యర్థుల పేర్లు మారుతున్నాయి. తొలి జాబితాలో ప్రకటించిన కొంత మంది స్థానంలో ప్రత్యామ్నాయ పేర్లను పరిశీలిస్తున్నారు.

వీరిలో కొంత మందికి మరో చోట అవకాశం కల్పించడం, లోక్ సభ బరిలోకి దింపడం లాంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

మొత్తం మీద మిగిలిన 35 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన సంక్లిష్టంగా మారింది. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 126 మందితో తొలి జాబితా ప్రకటించారు. ఆ తర్వాత మరో 15 మందితో రెండో జాబితా ప్రకటించారు. 34 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.

అయితనే.. తొలి జాబితాలో పేరు దక్కించుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ గూటికి చేరడంతో పెండింగ్ స్థానాల సంఖ్య 35కు పెరిగింది.

ఈ 35 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠగా సాగుతోంది. కొన్ని చోట్ల లోక్ సభకు అసెంబ్లీ సెగ్మెంట్ల లింకులతో సమీకరణలు మారుతున్నాయి.

ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి కలవపూడి శివను బరిలోకి దింపాలని భావిస్తున్నారు.

కలవపూడి శివకు తొలి జాబితాలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలోనూ ఇదే రకమైన పరిస్థితి ఏర్పడింది.

గుంటూరు జిల్లా నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావును బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం తొలుత భావించింది. అయితే..

ఆయనకు వయసు పైబడిన నేపథ్యంలో యువ నేతల నుంచి పోటీ ఏ మేరకు ఎదుర్కొంటారోనని నేతలు పునరాలోచనలో పడ్డారు.

గుంటూరు వెస్ట్ స్థానం నుంచి రాయపాటి తనయుడు రంగబాబుకు అవకాశం ఇచ్చి నర్సరావుపేట లోక్ సభ స్థానాన్ని మరొకరికి కేటాయించేలా కసరత్తు జరుగుతోంది. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల స్థాన చలనం తప్పేట్లు లేదు.

నెల్లూరులో 3 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. సంక్లిష్టమైన నియోజకవర్గాల్లో తీవ్ర కసరత్తు జరుగుతోంది. ప్రొద్దుటూరులోనూ కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది.

పలు చోట్ల ఇద్దరేసి అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నేపథ్యంలో మూడో పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో గుంటూరులో భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనలోకి వచ్చింది.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు)కు అవకాశం దక్కినట్లు జిల్లాలో ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆ స్థానం నుంచి తొలి జాబితాలో అవకాశం దక్కించుకున్న వేటుకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ)కు నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. వీరికి అభినందనలు చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *