డేటా చోరీ చేసి బాబు అడ్డంగా బుకాయిస్తున్నారు: జగన్

తప్పులు చేసినప్పుడు చంద్రబాబుకు సెక్షన్ 8, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గుర్తుకొస్తాయి.

ఓటుకు నోటు కేసులో ఇవే మాటలు మాట్లాడారని.. మళ్లీ ఇప్పుడు డేటా దొంగతనం చేసి పట్టుబడుతూ మళ్లీ ఇవే మాటలు మొదలు పెట్టారు.

1.నెల్లూరులో వైసీపీ సమర శంఖారావం
2.చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శలు
3.డేటా చోరీ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ను ఓ దొంగ, నేరగాడు, రాక్షసుడు పాలిస్తున్నాడన్నారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు పట్ట పగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. అడ్డంగా దొరికిపోయి దొంగే, దొంగ అన్నట్లు నేరాన్ని పక్కవాళ్లపై తోస్తున్నారని మండిపడ్డారు.

ఏపీ ప్రజల సమాచారాన్ని తీసుకెళ్లి తన బినామీ కంపెనీలకు అప్పగించి.. ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారని ఆరోపించారు. మంగళవారం నెల్లూరులో జరిగిన వైసీపీ సమరశంఖారావం సభలో పాల్గొన్న జగన్.. చంద్రబాబు టార్గెట్‌గా నిప్పులు చెరిగారు.

59లక్షలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు జగన్. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని చంద్రబాబు కుట్రలకు తెర తీశారని.. వైసీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

చివరికి తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఓటును తొలగించారని ఆరోపించారు.

చంద్రబాబు తన బినామీ కంపెనీలకు ఏపీ ఓటర్ల సమాచారాన్ని అప్పగించి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని మండిపడ్డారు జగన్. డేటాను అప్పగించడమే కాక.. అడ్డంగా బుకాయిస్తున్నారని విమర్శించారు.

ఓ దొంగ, రాక్షసుడు, నేరగాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జగన్. చంద్రబాబు తీరు దొంగే దొంగ, దొంగ అన్నట్లుందన్నారు.

ప్రతి నియోజకవర్గంలో ఓట్లను తొలగిస్తున్నారని.. రాష్ట్రంలో ప్రతి ఓటరు బ్యాంక్ అకౌంట్, చెక్ నెంబర్ చంద్రబాబుకు తెలుసన్నారు.

బాబు బినామీ కంపెనీలోని కంప్యూటర్లలో ఏపీ ప్రజల సమాచారం ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఆ కంపెనీతో లోకేష్, చంద్రబాబుకు ఉన్న సంబంధమేంటో చెప్పాలన్నారు.

ఈ డేటాను కంపెనీలకు ఎందుకు ఇచ్చారు.. ఈ డేటాను దొంగతనం చేయడం నేరంకాదా అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ పోలీసులు ప్రైవేట్ కంపెనీల్లో దాడి చేయగానే.. చంద్రబాబు ఏపీ పోలీసుల్ని ఉసిగొలిపారని జగన్ ఆరోపించారు. ఏపీ పోలీసుల్ని వాచ్‌మెన్లుగా వాడుకుంటున్నారని.. ఈ ప్రశ్నలన్నీ అడిగితే హైదరాబాద్ తానే కట్టా.. మొబైల్ తానే కనిపెట్టానంటూ సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

డేటా ప్రజల సొత్తు.. అందరి ఆస్తి.. దానిని చంద్రబాబు అమ్ముకుంటున్నారని విమర్శించారు. దొంగతనం చేసి పట్టుబడితే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి.. తిరిగి వైసీపీపైనే బురదజల్లుతున్నారని మండిపడ్డారు.

తప్పులు చేసినప్పుడు చంద్రబాబుకు సెక్షన్ 8, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గుర్తుకొస్తాయని జగన్ ఆరోపించారు.

ఓటుకు నోటు కేసులో ఇవే మాటలు మాట్లాడారని.. మళ్లీ ఇప్పుడు డేటా దొంగతనం చేసి పట్టుబడుతూ మళ్లీ ఇవే మాటలు మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో తనకు ఎవరైతే ఓటు వేయరో వారి ఓట్లను తొలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని.. తనకు ఓటు వేయనంటే మనుషుల్ని చంపేస్తారేమో.. గ్రామాలను కూడా తగలబెట్టేస్తారేమో అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో టీడీపీవారు కాదనుకుంటే పెన్షన్లు, పథకాలను నిలిపివేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *