పంజాబ్ నుంచి మాజీ ప్రధానిని పోటీకి దింపాలని కాంగ్రెస్: నో చెప్పిన మన్మోహన్!

కాంగ్రెస్ విన్నపానికి నో చెప్పిన మన్మోహన్!
గతంలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన మాజీ ప్రధాని మన్మోహన్ ఆ తర్వాత ఎప్పుడు బరిలో నిలవలేదు.

దీంతో ఆయనను మరోసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దింపడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

1.ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి విముఖత వ్యక్తం చేసిన మన్మోహన్.
2.పంజాబ్ నుంచి మాజీ ప్రధానిని పోటీకి దింపాలని కాంగ్రెస్ యోచన.
3.కాంగ్రెస్ ప్రతిపాదనలను తిరస్కరించిన మన్మోహన్.

ప్రత్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి మాజీ ప్రధాని, సీనియర్ కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని అమృత్‌‌సర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీచేయాలన్న కాంగ్రెస్ నేతల విన్నపాన్ని మన్మోహన్ సున్నితంగా తిరస్కరించనట్టు సమాచారం.

దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ కెప్టెన్ అమరీందర్ సింగ్ సహా కీలక నేతలు అభ్యర్థించినా ఆయన మాత్రం ససేమిరా అన్నారని భోగట్టా. మన్మోహన్ ఇలా తిరస్కరించడం తొలిసారి కాదు. యూపీఏ-1 హాయంలో మొదటి సారి ప్రధాని పదవిని చేపట్టిన మన్మోహన్,

ఆ తర్వాత 2009 సాధారణ ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కినా అనారోగ్య కారణాలతో తప్పుకున్నారు. ఇక, గత సార్వత్రిక ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి బీజేపీ తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, కాంగ్రెస్ తరఫున కెప్టెన్ అమరీందర్ సింగ్ పోటీపడ్డారు.

అయితే, అమరీందర్ సింగ్ చేతిలో అరుణ్ జైట్లీ ఓటమిపాలయ్యారు. అనంతరం 2017లో జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

దీంతో ప్రస్తుతం ఆయన స్థానంలో బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే మన్మోహన్‌ను పోటీకి నిలపాలని భావించింది.

అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మన్మోహన్ పదవీకాలం వచ్చే జూన్ 14తో ముగియనుంది. 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్మోహన్ ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో కేవలం ఒక్కసారి మాత్రమే పోటీచేసి ఓటమిచవిచూశారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి నిలిచిన ఆయన, బీజేపీ అభ్యర్థి వీకే మల్హొత్రా చేతిలో ఓడిపోయారు.

కాగా, అసోంలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉండటం, కాంగ్రెస్‌కు తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో మరోసారి మన్మోహన్‌ను అక్కడ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశాలు తక్కువ.

ఆల్ ఇండియా యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్ లాంటి పార్టీల మద్దతు తీసుకోకపోతే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సాధ్యం కాదు. కాబట్టి మన్మోహన్ నుంచి వేరే రాష్ట్రం నుంచి ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇక, పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు చివరి విడతలో 19న పోలింగ్ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *