జగన్ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఎంపీ కేశినేని నాని…
జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఒక పథకం ప్రకారం అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఎన్నికలకు వెళ్తామా అని సవాల్ విసిరారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. అమరావతి రైతుల నిరసనలకు మద్దతు తెలిపిన నాని.. జగన్ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను జగన్ అపహాస్యం చేస్తున్నారని.. రైతు కంట కన్నీళ్లు పెట్టించిన వాళ్లెవరైనా చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన విమర్శించారు.
రాజధాని ఎడారి.. శ్మశానమని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేశినేని నాని ఘాటుగా స్పందించారు.
సీఎం జగన్.. ఆయన పిల్లలు ఎడారిలో, శ్మశానంలో పుట్టి ఉంటారని.. అందుకే వారికి అలా కనపడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఒక పథకం ప్రకారం అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్నారని.. అలాంటి ట్రేడింగ్ జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
సీఎం జగన్ జైలు జీవితంపై కేశినేని నాని విమర్శలు చేశారు. పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్.. మళ్లీ జైలుకి వెళ్తారని అన్నారు.
ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడిన వాళ్లని కూడా జైలుకి పంపించాలన్నారు. ఒక కులానికే రాజధాని అని ముద్రవేసి రాజధాని తరలించే యత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఏ కులాన్నైనా.. ప్రాంతాన్నైనా అణగదొక్కాలని చూస్తే వెయ్యి రెట్లు ప్రతిఘటన ఎదురవుతుందని ఎంపీ నాని హెచ్చరించారు.
రాజధాని తరలింపు ప్రతిపాదనలపై ఎంపీ నాని తీవ్రంగా స్పందించారు. రాజధానిని తరలించడం మీ తాత రాజారెడ్డి, ముత్తాత వల్ల కూడా కాదంటూ మండిపడ్డారు.
ఒక్క అవకాశమివ్వాలని అడుక్కుంటే ప్రజలు నమ్మి ఓట్లేశారని నాని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఇప్పుడు ఎన్నికలకు వెళితే డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తరిమి కొడతారని విమర్శించారు.
దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం పదా అని సవాల్ విసిరారు. బస్తీమే సవాల్.. మాట తిప్పం, మడం తిప్పం అని బాడీ మొత్తం తిప్పేస్తున్నారంటూ నాని సెటైర్లు వేశారు.