అవినీతి చేస్తూ రెడ్ హ్యాండెట్గా దొరికిపోతే ఏడాదిలోపే శిక్ష పడేలా చట్టం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు…సీఎం జగన్ సంచలన ప్రకటన

లంచగొండుల్లో వణుకుపుట్టేలా ప్రత్యేక చట్టం.. సీఎం జగన్ సంచలన ప్రకటన
అవినీతిపరుల ఆటకట్టించడం కోసం ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అవినీతిని కూకటివేళ్లతో సహా పెకలించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు.
అవినీతి చేస్తూ రెడ్ హ్యాండెట్గా దొరికిపోతే ఏడాదిలోపే శిక్ష పడేలా చట్టం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో ఎవరైనా సరే అవినీతి చేయాలంటే భయపడే స్థాయికి రావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు.
14400 కాల్ సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక, రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 1902 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏసీబీతో అనుసంధానం చేయాలని, గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి వచ్చే అవినీతి ఫిర్యాదులను కూడా స్వీకరించాలని ఆదేశించారు.
అలాగే వచ్చిన ఫిర్యాదులను మానిటరింగ్ చేసే వ్యవస్థ బలంగా ఉండాలన్నారు. 1902కు వచ్చే కాల్స్కు సంబంధించి మానిటరింగ్ చేసేందుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
దీనికి కలెక్టర్ కార్యాలయాలను కూడా అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీఓ కార్యాలయాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతి ఆనవాళ్లు ఉండకూడదని స్పష్టం చేశారు.
అలాగే అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు గాను 14400 నెంబర్పై మరింత ప్రచారం నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
పర్మినెంట్గా హోర్డింగ్స్ పెట్టాలని సూచించారు. రెడ్ హ్యండెడ్గా దొరికిన కేసుల్లో చర్యలు తీసుకోవడానికి సంవత్సరాల కాలం పట్టకూడదు.
లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కేసుల్లో కూడా దిశ చట్టం మాదిరిగానే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా ఉండాలని స్పష్టం చేశారు.
కొన్ని అవినీతి కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోందంటే.. అవినీతి నిరోధకత విషయంలో సీరియస్గా లేమనే సంకేతాలు ప్రజల్లో వెళ్తున్నాయని తెలిపారు.
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత వెంటనే చర్యలు తీసుకునేలా విధానాలు ఉండాలని, దీని కోసం అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలని సంబంధించిన అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.