రాష్ట్రస్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్యను 5 నుంచి 10కి పెంచాలని ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం…

కరోనా కట్టడికి సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో కోవిడ్ ఆస్పత్రులు డబుల్..

ఏపీలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో బోల్డ్ స్టెప్ తీసుకున్నారు.

కరోనా వైరస్ నివారణకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు.

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, హెల్త్ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్యను 5 నుంచి 10కి పెంచాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.

వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.

జిల్లాల్లో ఉన్న 84 కోవిడ్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు కల్పించాలన్నారు.

ఆయా ఆస్పత్రుల్లో ఏం చేయాలనే దానిపై రెండు రోజుల్లో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రుల మాదిరిగా ఈ ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయి సేవలు అందించడంపై దృష్టి పెట్టాలన్నారు.

ప్రస్తుతం ఉన్న 5 రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన సేవల కోసం సత్వర చర్యలు చేపట్టాలని.. వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అలాగే కోవిడ్‌ సోకిందన్న అనుమానం వస్తే ఏంచేయాలి? ఎవర్ని కలవాలన్న దానిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఎవరికైనా కరోనా వైరస్ వస్తుందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. 85 శాతం మందికి ఇళ్లల్లోనే ఉంటూ నయం అవుతుందన్నారు.

కరోనాకు జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు, వయసులో పెద్దవాళ్లు వైద్య సహాయంలో ఆలస్యం వద్దని హెచ్చరించారు.

క్వారంటైన్‌ సెంటర్ల సంఖ్య కన్నా క్వాలిటీ మీద దృష్టి పెట్టాలని సూచించారు. కోవిడ్‌ ఉందా? లేదా? అనేది తెలుసుకునేందుకు ర్యాపిడ్‌ టెస్టులు అందుబాటులోకి వచ్చినందున ఎవరిని ఎక్కడ పెట్టాలన్న దానిపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత వారికి మంచి సేవలు అందించాలని సూచించారు.

అలాగే కాల్‌ సెంటర్‌ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు.

టెలీ మెడిసిన్‌పై ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలన్నారు. వైద్య రంగంలో చేపట్టనున్న నాడు–నేడు కార్యక్రమాలపై ఫోకస్‌ పెంచాలన్నారు.

వచ్చే మూడు, నాలుగు నెలలపాటు నిర్దేశించుకున్న కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

ఇవన్నీ పూర్తయితేనే కోవిడ్‌ లాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగలమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *