రోజాతో అడిగి మరి తిట్టించుకున్న కేశవ్!
వాడీవేడిగా జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శాసనసభ జరగుతున్నప్పుడు అధికార , ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎడాపెడా తిట్టుకుంటారు. విమర్శించుకుంటారు. సభలో మాటల తూటాలు పేల్చుకున్న ఎమ్మెల్యేలు.. కానీ అదే శాసనసభ లాబీల్లోకి వచ్చేసరికి విభేదాలను మరిచి ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకుంటారు. అలాంటిదే ఒక సంఘటన మంగళవారం నాడు కూడా చోటు చేసుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. చికిత్సకోసం అమెరికాకు వెళ్లిపోయినా సరే.. ఆ పార్టీ ఎమ్మెల్యే కేశవ్ పనిగట్టుకుని ఆయనకు తిట్లుపడేలా చేశారు.తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు అసెంబ్లీ లాబీల్లో వైకాపా ఎమ్మెల్యే రోజా ఎదురుపడ్డారు. కేశవ్ ఊరుకోకుండా.. రోజా అసెంబ్లీ ప్రసంగంలో ఇదివరకటి వాడీ వేడీ లేవని పయ్యావుల కేశవ్ ఆమెతో సరదాగా వ్యాఖ్యానించారు.
తమను తిట్టడంలో ముందుండే రోజా, ఇప్పుడు మౌనంగా ఉంటున్నారంటూ అన్నారు. ఆ మాటల ద్వారా ‘మంత్రిపదవి రాలేదు గనుక’ ఆమె అసంతృప్తిగా ఉన్నదనే భావనను రెచ్చగొట్టడానికన్నట్లుగా కేశవ్ మాట్లాడారు. కేశవ్ వ్యాఖ్యలకు రోజా మాత్రం దీటుగానే స్పందించారు.
చంద్రబాబు సభలో లేకపోవడం వల్లే తన ప్రసంగంలో వాడితగ్గి సరిగా తిట్టలేకపోయానని, చంద్రబాబు మొహం చూసిన వెంటనే తిట్లు అవంతట అవే వస్తాయని రోజా అనడంతో పయ్యావుల కేశవ్ కంగుతున్నారు. దానికి ఎదోసమాధానం కేశవ్ ఇవ్వబోతుండగా…
చంద్రబాబు లేని సమయం చూసి శాసనసభలో కేశవ్, జగన్ భజన చేస్తున్నారంటూ రోజా మరింత ఘాటుగా మాట్లాడారు. దీంతో కంగారు పడ్డ కేశవ్.. మొదటికే మోసం వస్తుందని భావించి అక్కడినుంచి జారుకున్నారు.