ప్రజా శాంతి పార్టీ గుర్తుపై మరోసారి వైసీపీ అభ్యంతరాలు…

పాల్ ఎర్త్.. వేర్వేరు గుర్తులు కేటాయించాలని వైసీపీ డిమాండ్!
ఏకంగా 35 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ, ప్రజా శాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు ఇంచు మించు ఒకేలా ఉన్నాయి. ఒక్క అనంతపురంలోనే ఎనిమిది చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది.
1.ప్రజా శాంతి పార్టీ గుర్తుపై మరోసారి వైసీపీ అభ్యంతరాలు.
2.పార్లమెంటుకు ఉమ్మడి గుర్తు, అసెంబ్లీకి వేర్వేరు గుర్తులు ఇవ్వాలని డిమాండ్.
3.జగన్ ప్రతిష్ఠకు భంగం కలిగేలా టీడీపీ వ్యవహరిస్తోందని ఫిర్యాదు.
వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన వారితోనే ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులుగా కేఏ పాల్ నామినేషన్లు వేయించడంతో ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికే ప్రజా శాంతి పార్టీ గుర్తు వల్ల తమకు నష్టం జరుగుతుందని గగ్గోలు పెడుతోన్న వైసీపీని పాల్ చర్యలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి.
ఒకటి రెండు కాదు ఏకంగా 35 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ, ప్రజా శాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు ఇంచు మించు ఒకేలా ఉన్నాయి. ఒక్క అనంతపురంలోనే ఎనిమిది చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది.
చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కడప జిల్లాలోనూ పాల్ పార్టీ అభ్యర్థులు గుబులు పుట్టిస్తున్నారు.
అలాగే కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, కాకినాడ పార్లమెంటు స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులను పోలిన పేర్లు ఉన్న అభ్యర్థులనే పాల్ నిలబెట్టారు.
మొత్తం 35 నియోజకవర్గాల్లో వైసీపీ, ప్రజా శాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురవుతారనేది వైఎస్ఆర్సీపీ వాదన.
దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ నేతలు ఆ పార్టీ అభ్యర్థులకు వేర్వేరు గుర్తులు కేటాయించాలని కోరారు.
ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులకు మాత్రమే హెలికాప్టర్ గుర్తును కామన్గా కేటాయించాలని..
అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోన్న వారికి మాత్రం ఇండిపెండెట్ల మాదిరిగా వేర్వేరు గుర్తులు కేటాయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి, అదనపు కార్యదర్శి పద్మారావు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతిపత్రం అందజేశారు.
అలాగే తమ అధినేత జగన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా టీడీపీ వ్యవహరించిందని ఫిర్యాదు చేశారు.
గూగుల్లో మోస్ట్ కరప్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని వెతికితే జగన్ పేరు వచ్చేలా వారే మేనేజ్ చేశారని ఆరోపించారు.
అలాగే జగన్ పేరిట ఓ నకిలీ మేనిఫెస్టోను తయారు చేసి టీడీపీ ఇంటింటికీ పంపిణీ చేస్తోందని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని వారు కోరారు.