న్యూ లుక్లో పవన్ కళ్యాణ్.. జనసైనికుల కోసం స్పెషల్ ఇంటర్వ్యూ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కోసం స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికే పరిమితమయ్యారు.
ట్విట్టర్లో యాక్టివ్గా పవన్ కళ్యాణ్.. దేశ, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు.
అయితే కొంత కాలం క్రితం సినిమా షూటింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి అప్పుడప్పుడు కనిపించిన జనసేనాని.. లాక్ డౌన్ కారణంగా చాలా కాలంగా అభిమానులకు దర్శన భాగ్యం కనిపించ లేదు.
పార్టీ కార్యక్రమాల్లో భాగంగా అంతర్గతంగా పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నాయకుడిని తనివితీరా చూసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ తరుణంలో జనసైనికులు కోరిక మేరకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
టెలీ కాన్ఫరెన్సుల ద్వారా పార్టీ నాయకులు, శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలతో అనుసంధానం అవుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. పార్టీ మీడియా విభాగం, సోషల్ మీడియా విభాగాల కోరిక మేరకు వారికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
అనేక మంది జనసైనికుల కోరిక మేరకు పవన్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు పార్టీ పేర్కొంది. కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కొనుగోలు చేసిన చేనేత వస్త్రాలను ధరించి ఈ ఇంటర్వ్యూ ఇచ్చారని జనసేన పార్టీ పేర్కొంది.
దీక్ష వెనుక ఉన్న విశేషాలను కూడా పవన్ పంచుకున్నారని తెలిపింది.
ఈ ఇంటర్వ్యూలో జాతీయ, ప్రాంతీయ అంశాలపై పవన్ సుదీర్ఘంగా తన అభిప్రాయాలను, జనసేన విధానాన్ని వెల్లడించారు. కరోనా వ్యాప్తి, అత్మనిర్భర భారత్ కార్యక్రమం ఆశయం, చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ బలమైన వైఖరి తదితర అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.
అలాగే కరోనాపై వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత, దాళితులపై దాడులపై నిలదీశారు. ఈ ఇంటర్వ్యూ తొలి భాగం గురువారం ప్రజలకు ముందుకు వస్తుంది.