సెప్టెంబర్ 5వ తేదీన.. జగనన్న విద్యా దీవెన పథకం కింద డబ్బు అందజేస్తామని..మంత్రి సురేష్

ఏపీలో తల్లిదండ్రులకు శుభవార్త.. జగనన్న విద్యా కానుక ఇచ్చే తేదీ ప్రకటించిన మంత్రి
సెప్టెంబర్ 5వ తేదీన ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభిస్తామని, ఆరోజే జగనన్న విద్యా దీవెన పథకం కింద డబ్బు అందజేస్తామని మంత్రి సురేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల 5 నుంచి ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
అదే రోజున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ‘జగనన్న విద్యా కానుక’ అందిస్తామని ప్రకటించారు.
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున పాఠశాలలు ప్రారంభమైన రోజే 43 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక ఇస్తామని వెల్లడించారు.
ఇందుకోసం మొత్తం రూ.650 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల నుంచి కళాశాలల వరకు 2020- 21 విద్యా సంవత్సర ప్రణాళికను ప్రకటించారు.
పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఈ బదిలీలు ఉంటాయని, ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీచర్ల బదిలీల ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు.
అలాగే అక్టోబర్ 15వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలు పున: ప్రారంభం అవుతాయని మంత్రి సురేష్ వెల్లడించారు. కళాశాలలు తెరవగానే గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు.
సెప్టెంబర్ 30 లోపు పరీక్షలు పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 15 నుంచి 21 లోపు అన్ని సెట్లు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.