ఎన్టీయార్ సినిమా రెండు భాగాలుగా తెరపై రాబోతోంది



సినిమాలో బసవ రామ తారకం నిర్యాణం వరకే చూపిస్తారట.

ఎన్టీయార్ – ఆ మూడు అక్షరాలలోనూ ఒక పవర్ తెచ్చి పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అటువంటి వ్యక్తి, నటుడు అంతకుముందుదాకా తెలుగుతెరపై ఉద్భవించలేదు. ఇప్పట్లో ఉద్భవిస్తాడన్న ఆశ కూడా లేదు. రామారావుగారు పోయినప్పుడు వచ్చిన జనం చూస్తే మతి పోతుంది. ఏ రాజకీయ నాయకుడికీ అంత జనం రారు. ఏ నటుడికీ అంత జనం రారు. మహా నటుడు, ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు వీళ్లిద్దరకూ కలిపి రావలసిన జనం కంటె ఎక్కువమంది వచ్చారు. ఆ ఎక్కువ ఎందుకు వచ్చారంటే, అదీ ఆయన పర్శనాలిటీ!

ఎన్టీయార్ ఎంతో పెట్టిపుట్టిన వ్యక్తి. మహర్జాతకుడు. ఆయనకు 5 ఏళ్ల వయసులో అక్షరాభ్యాసం ముందు వల్లూరు వెంకన్న పంతులు గారి వద్దకు తీసుకెళితే, ఆయన దానికి ముందు పాద సాముద్రికం చూడాలంటూ పళ్లెంలో బియ్యప్పిండి పోయించి, పిల్లవాణ్ని నిల్చోమన్నారు. పాదముద్రలు చూస్తే అరికాళ్లల్లో శంఖుచక్రాలు ఉన్నట్లు కనబడింది. ‘వీడు దైవాంశ సంభూతుడు, మహర్జాతకుడు’ అని డిక్లేర్ చేశారాయన.

ఆయన వేసిన పాత్రలు ప్లస్ సమ్థింగ్ వుంది ఆయనలో. అదే జనాలను ఆకట్టుకుంది. ఎన్టీయార్ సినీరంగ ప్రవేశం ‘మనదేశం’ సినిమాతో జరిగింది. అది 1949. అంటే అప్పటికి ఆయనకు 26 యేళ్లు. అంటే నాగేశ్వరరావుగారి కంటె ఏడాదిన్నర పెద్దయినా ఎనిమిదేళ్లు వెనుకగా సినీరంగంలో ప్రవేశించారన్నమాట. 1941 ధర్మపత్ని అక్కినేని మొదటి సినిమా. ఎనిమిది ఏళ్ళు వెనకాల వచ్చినా అతి త్వరలో ఎన్టీయార్ నాగేశ్వరరావుగారికి పోటీగా మారారు.

సీనియర్, అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన నాగేశ్వరరావుకి నిద్రపట్టకుండా చేసిన రామారావు అర్హతలేమిటి? మంచి రూపం, మంచి శరీర సౌష్టవం, మంచి వాచికం, మంచి చదువు, మంచి నేపథ్యం.. అన్నీ మంచిలే! ఎన్నో లోపాలు అధిగమిస్తూ నాగేశ్వరరావు తన ప్రస్థానం సాగించారు. రామారావుకి ఆ బాధలు లేవు. హీ ఈజ్ ఏ బోర్న్ హీరో! నేచురల్గా ఆయన టాలెంటుకు వెనువెంటనే గుర్తింపు వచ్చింది. వస్తూ వస్తూనే ఆయన హీరో అయిపోయారు. ‘అంటే ‘మనదేశం’లో హీరో నారాయణరావు. ఈయనది చిన్న ఇన్స్పెక్టర్ వేషం. ఎల్వీ ప్రసాద్గారితో మొహమాటం కొద్దీ వేయాల్సి వచ్చింది. దానికంటె ముందు బుక్ అయినది, రిలీజవ్వాల్సినది అయిన ‘పల్లెటూరి పిల్ల’లో ఈయనది హీరో వేషం. అది లెక్కలో తీసుకుని మొదటి సినిమా నుండే హీరో .

ఎన్ టి ఆర్ గుంటూరులో ఎసి కాలేజీలో బిఏ చదివే రోజుల్లోనే సినిమా ఆఫర్లు వచ్చాయి. బిఏ పూర్తవందే సినిమాల్లో చేరే ఉద్దేశం లేదన్నారు. అప్పటికే జగ్గయ్య, ముక్కామల వీళ్లందరితో కలిసి నాటకాలు వేసేవారు. ఈయన వేసిన ఓ నాటకం చూసి సినీనటి శ్రీరంజని భర్త సి.పుల్లయ్యగారికి పరిచయం చేశారు. పుల్లయ్యగారు ‘కీలుగుర్రం’ తీసే ప్రయత్నాల్లో వున్నారు. అందులో రాకుమారుడి పాత్రకు ఈయన బాగుంటారని అనుకున్నారు పుల్లయ్యగారు. అడ్రసు తీసుకున్నారు. మద్రాసు వెళ్లాక ఆయన ఐడియా మారింది. ”కీలుగుర్రం’ కాదు, ‘వింధ్యరాణి’లో వేషం యిస్తాం, రా’ అన్నారు. ఈయన చదువు వదిలి రానన్నారు.

ఎన్ టి ఆర్ 1923 మే 28న నిమ్మకూరులో పుట్టారు. అది చాలా కుగ్రామం. ఏ విధమైన సౌకర్యమూ లేదు. తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకట్రామమ్మలకు ఆలస్యంగా పుట్టిన సంతానం, ఇతను పుట్టిన 4 ఏళ్లకు తమ్ముడు పుట్టాడు. తాత రామస్వామి చౌదరికి 80 ఎకరాలుండేవి. లక్ష్మయ్య చౌదరిగారికి యిద్దరు అన్నలు, ఒక తమ్ముడు. తలా 20 ఎకరాలు వచ్చాయి. 5 కి.మీ.ల దూరంలో ఉన్న నిడుమోలు గ్రామవాసి వల్లూరి సుబ్బయ్య పంతులు అనే ఆయన వద్ద ఎన్ టి ఆర్ 1,2,3 క్లాసులు చదవడం జరిగింది. 4,5 తరగతులు అవురుపూడి మునసబు గారింట్లో నడుస్తున్న ఇంగ్లీషు బడిలో చదివించారు.

ఎన్ టి ఆర్ పెద నాన్న రామయ్య గారు దంపతులు విజయవాడకు మకాం మార్చి ఎన్ టి ఆర్ ను తమ దగ్గరే పెట్టుకుని 1933లో విజయవాడ గాంధీ మునిసిపల్ హైస్కూల్లో హైస్కూలు చదువు చదివించారు. దానితో బాటు రామయ్య గారు యితన్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని విజయవాడలోని దుర్గా కళామందిర్కు తీసుకుని వచ్చి నాటకాలు చూపించేవారు. బందా, స్థానం, వేమూరి వగైరాలు నటించేవారు, అవి చూసి యితనికి నాటకాలపై ఇంట్రస్టు కలిగింది. ఎస్సెల్సీ టైములోనే పుండరీ కాక్షయ్య, సుంకర కనకారావు వగైరాలు పరిచయమయ్యారు.

1940లో ఎస్సెల్సీ పూర్తయ్యేసరికి రామయ్య గారి ఆస్తి కరిగిపోయింది. ఇంకో నాలుగైదేళ్లకు పోయారు కూడా. ఈలోగా ఎన్ టి ఆర్ తండ్రి ఆస్తి పోగొట్టుకుని, పొలమంతా అమ్మేసి, విజయవాడకు కాపురం మార్చారు. తండ్రి 4 గేదెలు కొని పాల వ్యాపారం మొదలెట్టారు. హీరో సైకిలు మీద యిళ్లకు పాలు పోసి కాలేజీకి వెళ్లేవారు ఎన్ టి ఆర్. నిజానికి యితను చిన్నప్పణ్నుంచి కష్టానికి వెరవలేదు. సెలవుల్లో యింటికి వెళ్లినపుడు కాలవ నుంచి 40 కావిళ్ల నీళ్లు గంటలో తోడి యింటికి తెచ్చేవారు.

ఎస్సెల్సీ తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటరు లో చేరారు ఎన్ టి ఆర్. విశ్వనాథ సత్యనారాయణ గారు లెక్చరరు. కాలేజీలోనే కెవిఎస్ శర్మ (తర్వాతి కాలంలో సినిమా నటుడు) పరిచయమయ్యారు. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి అనే సినీ నటుడు (‘భక్త పోతన’, ‘పెద్దమనుష్యులు’ వగైరా సినిమాల్లో వేశారు) యితనిపై అభిమానంతో రిక్షాలో కూర్చోపెట్టుకుని తిప్పుతూ సినిమా కబుర్లు చెప్పేవారు.

ఇంటరు చదువుతూండగానే జరిగిన పెళ్లి జరిగింది. బసవతారకం గారు యితని తల్లి కజిన్ బ్రదర్ కూతురు. ఆమెను చేసుకోవాలని పెద నాన్న రామయ్య పట్టుదల. మరో పక్క యితని పినతండ్రి తన బావగారి కూతురినిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నించారు. తల్లి వైపు బంధువులా, తండ్రి వైపు బంధువులా ఎవరి వైపు మొగ్గాలన్న విషయంలో మనస్పర్థలు వచ్చాయి. చివరకు యితని తలిదండ్రులు పెళ్లికి రాలేదు. పెద నాన్న రామయ్యే దగ్గరుండి జరిపించారు. ఎన్టీయార్ సినిమా ఫీల్డులో నిలదొక్కుకున్నాక పోయిన ఆస్తులన్నీ సాధించారు.

1942లో ఇంటర్ చదువు పూర్తయింది. పెళ్లి వలనో, నాటకాల వలనో ఇంటర్ రెండుసార్లు ఫెయిలయి 1945 వరకు పాస్ కాలేదు. (పెద నాన్న రామయ్య పోయినది యీ టైములోనే) ఈ మధ్యలో ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. మిలటరీ లేదా పోలీసు ఉద్యోగం చేద్దామనుకున్నారు. బంధువొకాయన మద్రాసు పచ్చయప్ప కాలేజీలో లెక్చరరుగా వున్న ఎన్జీ రంగా వద్దకు తీసుకెళ్లి సిఫార్సు చేశారు. ఆయన ‘నీకెందుకు ఉద్యోగం? పోయి వ్యవసాయం చేసుకో’ అన్నారు. ఇంటికి తిరిగి వచ్చి ఖాళీగా వున్నారు. బియ్యే చదవాలంటే విజయవాడలో ఆ సౌకర్యం లేదు, గుంటూరుకి వెళ్లాలి.

అప్పట్లో ఉద్యోగాలకైనా, సినిమాల కైనా బొంబాయి వెళ్లాల్సిందే. జనతా ఫోటో స్టూడియో కోటేశ్వరరావు అనే ఆయన్ని వెంటపెట్టుకుని బొంబాయి సినీరంగంలో చేరదామని వెళ్లారు. అక్కడ ఎడిటింగు విభాగంలోనో, సౌండ్ రికార్డింగు లోనో చేరమన్నారు. వద్దులే అనుకుని మిలటరీ వైపు చూశారు. రెండవ ప్రపంచయుద్ధంలో వార్ పోస్టల్ డెలివరీకై గ్లయిడర్లు నడిపేవారు. వాటికి పైలట్లగా పని చేయడానికి ఎమెచ్యూర్స్ను తీసుకుని 15 రోజుల శిక్షణ యిచ్చి గ్లయిడర్ ఎక్కమనేవారు. ఈయన 3 నెలల కోర్సులో చేరి, గ్లయిడర్లను నమ్మడానికి లేదని దానిలో చేరలేదు. తర్వాత బొంబాయిలో మాతుంగాలో ఆంధ్రా మెస్ నడిపారు. చివరకు ప్రాణం విసిగి, తండ్రి వెనక్కి వచ్చేయమంటే జనతా కోటేశ్వరరావుతో సహా వెనక్కి ఊరికి వచ్చేశారు.

అక్కణ్నుంచి విజయవాడలో పాల వ్యాపారం చేశారు. సైకిల్మీద వెళ్లి హోటళ్లకు పాలు పోసేవారు. పొగాకు వ్యాపారం పెట్టారు. రెండేళ్లపాటు యిలా కష్టపడ్డారు. బంధువులంతా హేళన చేశారు. ‘మీ పెదనాన్న నిన్ను తన దగ్గర వుంచుకుని పెంచాడు. పెద్ద చదువులు చదువుతావనీ, ఆఫీసరు అవుతావనీ కలలు కన్నాడు. ఆయన పోయాడు. నువ్వు చూస్తే యిలా వున్నావ్’ అన్నారు. బంధువులు హేళన చేయడంతో ఎన్టీయార్కు పట్టుదల వచ్చింది. రెండేళ్ల విరామం తర్వాత 1945లో బియేలో చేరారు. కష్టపడి చదివారు. ఆ టైములోనే ఇందాకా చెప్పిన సినిమా ఆఫర్ వస్తే వద్దన్నారు. తనను పెంచిన పెదనాన్నకు ఆత్మశాంతి లభించాలంటే బియే పూర్తవాల్సిందేనన్నారు.

1945 నుంచి 1947 వరకు కాలేజీలో బియ్యే చదివే రోజుల్లో ఎన్టీయార్ గుంటూరు నుంచి రైల్లో విజయవాడ వెళ్లేవారు. బండి తప్పిపోతే రైలు పట్టాల మీద నడుచుకుంటూ విజయవాడ వెళ్లిన సందర్భాలున్నాయి. అప్పుడు భార్య హరికేన్ లాంతరు పట్టుకుని యింటి దగ్గర వెయిట్ చేసేవారు. 1947లో ఎల్వీ ప్రసాద్గారు ‘శ్రీమతి’ అనే సినిమా ప్లాను చేస్తున్నారు – అల్టిమేట్ గా తీయలేదు – విజయవాడ వస్తే రామారావుగార్ని ఎవరో పరిచయం చేశారు. సినిమాల్లో వేస్తావా అంటే గ్రాజువేషన్ అయిపోయింది కాబట్టి సరేనన్నారు. ఆయన మద్రాసుకి రమ్మన్నారు. స్క్రీన్టెస్ట్లు చేయించారు. మళ్లీ పిలుస్తాం ప్రస్తుతానికి వెళ్లమన్నారు.

ఈయన వెనక్కి వచ్చి నేషనల్ ఆర్ట్ థియేటర్ పేర నాటకాలు వేస్తూండేవారు. తర్వాత సినిమా నిర్మాణం ఎన్.ఏ.టి. పేర చేసేవారు , దాని ఫుల్ ఫామే – నేషనల్ ఆర్ట్ థియేటర్. ఉద్యోగాలకై ప్రయత్నాలు కూడా చేస్తూండేవారు. సర్వీస్ కమీషన్కి పరీక్ష రాస్తే సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. జాబ్లో చేరుదామా లేదా అనుకుంటూండగానే జాబు వచ్చింది ఎల్వీ ప్రసాద్గారి వద్దనుండి. ‘శ్రీమతి ఆగిపోయింది, ‘మనదేశం’ తీస్తున్నాను. అందులో చిన్నవేషం వుంది. వచ్చి వేయండి’ అని. ‘హీరో అని చెప్పి చివరికి చిన్నవేషం వేయడమేమిటి?’ అనుకుని ఈయన సినిమా ఆశ వదిలేసి ఉద్యోగంలో చేరారు. చేరాడే కానీ ఈయన దానిలో పని చేసినది 11 రోజులు మాత్రమే! దానికో కారణం వుంది.

ఎన్టీయార్ది చిన్నప్పటినుండీ కష్టపడి పనిచేసే రైతు కుటుంబం. ఈయన చేరినదేమో అవినీతికి ఆలవాలమైన రిజిస్ట్రార్ ఆఫీసు. ఆఫీసులో చేరిన మొదటిరోజున ఈయన కోటు విప్పి కుర్చీకి తగిలించి పని చేసుకున్నారు. సాయంత్రానికి కోటు జేబు బరువుగా వుందట. చూస్తే లంచం డబ్బు! ఆఫీసు బంట్రోతు ఆరోజు ట్రాన్సాక్షన్స్లో ప్రతి వాడి వాటా కోటులో పడేసి వెళ్లేవాడు. ఇది చూడగానే ఈయన గంగవెర్రులెత్తిపోయారు. నాకు వద్దు పొమ్మన్నారు. దెబ్బకి ఆఫీసులో కొలీగ్స్ అందరికీ శత్రువై పోయారు. ఇలాటివాడు తమ మధ్య వుంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకున్నారు. ఇలాటి హోస్టయిల్ వాతావరణం ఆయనకు పడలేదు. పైగా ఓ కొలీగ్ ‘మేమందరం ధైర్యం చేయలేక ఇక్కడే పడి కొట్టుకుంటున్నాం. నీకు రూపం వుంది, సాహసం వుంది. సినిమా రంగానికి వెళ్లు’ అని నూరిపోశారు.

అలా ఎందుకన్నారంటే అప్పుడే ఎన్టీయార్కి బిఏ సుబ్బారావు గారి వద్దనుండి ఉత్తరం వచ్చింది. ఆయన అప్పుడే పైకి వస్తున్న దర్శకుడు. ‘పల్లెటూరి పిల్ల’ సినిమా ప్లాను చేస్తూ ఎల్వీ ప్రసాద్గార్ని సలహా అడిగారు. ఆయనేమో ఈయన్ని రికమెండ్ చేశారు. ‘మద్రాసు రండి’ అని బియే సుబ్బారావు ఉత్తరం రాశారు. చివరకి కొలీగ్ సలహా విని ఎన్టీయార్ మద్రాసు రైలెక్కారు. మద్రాసు వెళుతూనే ఎల్వీ ప్రసాద్ దగ్గరకు వెళ్లి ‘నాకు హీరో వేషం యివ్వలేదేం? నేను దానికి తగనా?’ అని నేరుగా అడిగేశారు. అదీ ఆయన స్టయిల్. జీవితమంతా ఆయన సమస్యలను ఎదుర్కోవడంలో అదే స్టయిల్ పాటించారు. దాపరికం లేదు. డైరక్టుగా తలపడడమే! ప్రసాద్గారు ‘కాలం కలిసిరాలేదు. ఈలోపున సుబ్బారావుగార్ని కలవండి’ అన్నారు.

ఈయన స్టూడియోకి వెళ్లి సుబ్బారావుగార్ని కలిశారు. ఎన్టీయార్ని వస్తూండగానే దూరం నుండి చూసి సుబ్బారావు గారు ‘ఇతను నా సినిమా హీరో అయితే ఎంత బాగుణ్ను’ అనుకున్నారు. ఈయన దగ్గరకు వెళ్లి ‘నేను ఫలానా’ అనగానే ‘అయితే నువ్వే నా హీరోవి’ అన్నారు. మేకప్ టెస్ట్ లేదు, వాయిస్ టెస్టు లేదు, ఏమీ లేదు. వెయ్యినూట పదహార్లు అడ్వాన్సు యిచ్చి బుక్ చేసేసుకున్నారు. ఎల్వీ ప్రసాద్ మొత్తుకున్నారు. చాలా రిస్కు తీసుకుంటున్నావని హెచ్చరించారు. ‘పోనీ నా ‘మనదేశం’లో చిన్న వేషం యిచ్చి చూస్తా. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుస్తుంది’ అన్నారు. సుబ్బారావు గారు వింటేగా? అబ్బే అదేం అక్కరలేదు అన్నారు. కానీ ఎల్వీ ప్రసాద్గారు ఎన్టీయార్కి మనదేశంలో చిన్న వేషం యిచ్చారు. అదీ విలనిక్ వేషం. దేశభక్తులపై విరుచుకుపడే పోలీస్ ఇన్స్పెక్టర్ వేషం. తొలివేషం హీరోకాదే అనుకుంటూనే ఎల్వీ ప్రసాద్గారి మీద గౌరవం కొద్దీ ఎన్టీయార్ వేషం ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఆయన పాత్రలో జీవించేశారు.

పాత్రలో జీవించడం అనేది మామూలుగా చాలామంది విషయంలో అనేస్తాం కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఎన్టీయార్ విషయంలో అతికినట్టుగా మరెవరి విషయంలోనూ నప్పదు. అది మొదటి సినిమాలోనే తెలిసింది. ఆయనది ఇన్స్పెక్టర్ వేషం. స్వాతంత్య్రవీరులపై లాఠీచార్జి చేయడం సీను. జూనియర్ ఆర్టిస్టులను కొంతమందిని తీసుకువచ్చి ‘వీళ్లు స్వాతంత్య్ర యోధులు’ అన్నారు. ‘యాక్షన్’ అనగానే ఈయన వాళ్ల మీద పడ్డారు. నిజంగానే చితక్కొట్టేశారు. వాళ్లు బాబోయ్ బాబోయ్ అన్నా వినలేదు. తరిమి తరిమి కొట్టారు.

వాళ్లు బెదిరిపోయి స్టూడియో గేటు దాకా పారిపోయినా ఈయన వెంట పడి మరీ కొట్టారు. డైరక్టరుగారు తిట్టిపోశారు – ఏమిటయ్యా నిజంగానే కొట్టావ్! అని. ‘పోలీసులు నిజంగానే కొడతారు కదా సార్’ అని ఈయన జవాబు. జూనియర్ ఆర్టిస్టులు కాబట్టి ప్రతాపం చూపించారు, అదే తనైతేనా? అని అనుకోవద్దు. ‘పల్లెటూరి పిల్ల’లో హీరో , అందులో అంజలిచేత చెంపదెబ్బ తినే సీను వుంది. ఆవిడ లాగి కొట్టినా డైరక్టరుగారు టేకు ఓకే చేయలేదు. మళ్లీ, మళ్లీ… తొమ్మిదిసార్లు కొడితే తప్ప టేకు ఓకే కాలేదు. మధ్యలో ఆవిడ ‘కొత్తబ్బాయండి, పాపం’ అన్నా ఎన్టీయార్ ‘ఏం ఫర్వాలే, కొట్టండి’ అని ఎంకరేజ్ చేశారు. చివరికి చెంప ఎర్రగా కందిపోయింది.

‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో కోడె దూడతో పోట్లాడే దృశ్యం వుంది. డూప్ను పెడతానంటే వద్దని ఈయనే రంగంలోకి దిగారు. ఎద్దు చూడబోతే బలిష్టమైన ఆస్ట్రేలియా గిత్త! శుబ్బరంగా ఎన్టీయార్ను ఎత్తి కుదేసింది. దెబ్బకి ఈయన కుడిచేతి మణికట్టు విరిగింది. ఆసుపత్రిలో కొన్నివారాలుండి చివరకు పుత్తూరు వైద్యంతో బాగు చేయించుకున్నారు. మళ్లీ కొన్నిరోజులకు తెల్లవారు ఝామున షూటింగ్ అయి నిర్మాత కారులో యింటికి వస్తూ వుంటే యాక్సిడెంటు అయి ఆ చేతికే దెబ్బ తగిలింది మళ్లీ. కట్టు కనబడకుండా ఫుల్హేండ్ చొక్కా వేసుకుని యాక్ట్ చేసేశారాయన.

ఇదంతా తొలిరోజుల మోజు అనుకోలేము. చివరిదాకా అలాగే వున్నారాయన. స్టంటు సినిమాల్లో నిజంగానే పోట్లాడేవారు. విలన్లను పట్టుకు చావగొట్టేవారు, వాళ్ల చేతిలో దెబ్బలు తినేవారు. గులేబకావళి సినిమాలో పొట్టి కత్తులతో పోట్లాడినప్పుడు గీరుకు పోయేవి. ‘కృష్ణావతారం’ సినిమా గురించి ఓ సంఘటన చెప్తారు. రాయబారం సీనులో ‘యుద్ధమంటూ జరిగితే భీమసేనుడు నీ తొడలు విరక్కొడతాడు చూసుకో’ అంటూ దుర్యోధనుణ్ని హెచ్చరిస్తూ పద్యం పాడే సీనులో ఎఫెక్టు కోసం చేతిలో వేణువు తొడమీద కొట్టుకుంటూ పద్యం పాడారు ఎన్టీయార్. అయితే అది మామూలు చెక్క ఫ్లూటు కాదు. స్టీలుది. కొన్ని టేకులు తీసుకుని మొత్తంమీద సీను ఓకే చేయించుకుని మేకప్ తీసేసి బట్టలు మార్చుకుంటూ వుంటే అప్పుడు కనబడ్డాయి తొడమీద ఫ్లూట్ గీతలు. ఎర్రగా రక్తం గడ్డకట్టేట్టు కొట్టేసుకున్నారాయన. అది తెలియను కూడా తెలియలేదు పెద్దమనిషికి.

భూకైలాస్ సినిమాలో వేసినప్పుడు రావణాసురుడు వేషం ఈయనది. రావణుడు తపస్సు చేస్తున్న సీను తీస్తూండగానే లంచ్ బ్రేక్ వచ్చింది. గడ్డాలూ, మీసాలూ పెరిగివుంటాయి, చుట్టూ మట్టితో కట్టిన పుట్ట. లంచ్కి లేస్తే ఈ పుట్టలన్నీ పాడయిపోతాయి. మళ్లీ కట్టాలి. ‘ఎందుకులెండి, మళ్లీ లేవడం, కట్టడం, ఈ పూటకు భోజనం మానేస్తాను’ అన్నారాయన. డైరక్టరు నొచ్చుకుని నచ్చచెప్పబోయినా ఎన్టీయార్ వినలేదు. అసలు అంతకుముందు సినిమాల్లో రాజుల కిరీటాలంటూ అట్టకిరీటాలు పెట్టేవారు. ఈయన కాలం వచ్చేసరికి లోహపు కిరీటాలు వచ్చాయి. ఈయన కిరీటం పెట్టుకుని కూచుంటే లంచ్ టైములో కూడా తీసేవారు కాదు. మేకప్ చెదిరిపోతుందని. ‘కర్ణ’ సినిమా తీసిన టైములో గంటల తరబడి కిరీటం పెట్టుకుని వుండడంతో నుదుటిమీద మచ్చ పడిపోయింది పాపం. ‘చిరంజీవులు’ సినిమాలో ఎన్టీయార్ది గుడ్డివాడి పాత్ర. ఆ ఎఫెక్టు రావడానికి కళ్లల్లో ఏవో పెట్టుకోమనేవారట. అవి పెట్టుకుంటే కళ్లు మంటలు. అయినా ఈయన కిమ్మనేవాడు కాదు. రోజుల తరబడి పెట్టుకుని కళ్లమంటలు భరించేవాడు, కళ్ల వెంబడి నీళ్లు కారినా డోంట్కేర్.

ఈ ట్రెండ్ యౌవనంలోనే కాదు, ముసలితనంలో కూడా కంటిన్యూ అయింది. ‘చండశాసనుడు’ సినిమా తీసేనాటికి 1983 నాటిది. అంటే అప్పటికి ఈయనకు 60 యేళ్లు. ఆ సినిమా షూటింగు టైములో ఈయన ఛాతీమీదనుండి బండి వెళ్లిపోయింది. ఈయన చెక్కు చెదరలేదు. షూటింగు ఆపేయలేదు.పనిలో ఆయన రాక్షసుడు. కుయ్కయ్మనకుండా చేసేవారు. చిక్కెక్కడంటే అందర్నీ అలాగే వుండమనేవారు. వాళ్లంతా గొల్లుమనేవారు. వాళ్లంతా ఆయనలా తెల్లవారు ఝామున రెండు గంటలకూ లేవలేరు. సూర్యోదయం కాకుండానే అరకోడి కూర లాగించనూ లేరు. ఆయన బ్రహ్మాండంగా తినేవారు. కావాలంటే రోజుల తరబడి అన్నం మానేసేవారు. రావణుడి వేషం వేసేటప్పుడు రెండు పూటలా నాన్వెజ్ తీసుకునేవారు. రాముడి వేషం వేసినప్పుడు మొత్తం మానేసేవారు. లాజికల్గా ఆలోచిస్తే యిది అనవసరం. ఎందుకంటే ఒరిజినల్ రాముడు కూడా నాన్వెజిటేరియనే కదా. క్షత్రియుడు. యుద్ధం చేయవలసినవాడు. అందువల్ల నాన్ వెజ్ తినేవాడే. కానీ ఆయన వేషం కట్టినరోజుల్లో ఈయన నాన్వెజ్ ముట్టుకునేవారు కాదు.

ఎందుకలా అంటే రాముణ్ని ఊహించినప్పుడు మనకు క్షత్రియుడు, రాజు కనబడడు. ఒక దైవాంశ సంభూతుడు కనబడతాడు. ఆ ప్రసన్నత, దైవాంశ కనబడాలంటే సౌమ్యంగా వుండాలని ఎన్టీయార్ వూహ. అందుకే ఆ నియమనిష్ఠలు. అలాగే దుష్టపాత్రలు వేసినపుడు ఎన్టీయార్ విపరీతంగా తినేవారు. ఇంకో విషయం కూడా వుంది. ఛాతీ మీద వెంట్రుకలు లేకుండా తీసేసేవారు. కండలు తిరిగినట్టు కనబడకుండా, కేవలం బలిష్టంగా మాత్రం కనబడేట్లా ప్రాణాయామం చేసేవారుట. పళ్లు గారపట్టకూడదని కిళ్లీ వేసుకునేవారు కాదు. ఈ జాగ్రత్తల వలననే ఆయన మనకు దేవుడికి ప్రతిరూపంలా అనిపిచేవారు. నార్త్ యిండియాలో వాళ్లు యిలాటి జాగ్రత్తలు తీసుకోలేదు. అందువల్ల వాళ్లు ఎంతబాగా నటించినా నటిస్తున్నారనే అనుకున్నాం తప్ప దేవుడు దిగి వచ్చాడని అనుకోలేక పోయాం.

ఎన్టీయార్ని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేనట్టు చేసినవి పౌరాణికాలే! ఆయన పౌరాణిక పాత్రల నిర్వహణ గురించి ‘న భూతో.. యిప్పట్లో న భవిష్యతి’ అని ధైర్యంగా చెప్పగలం. నాగేశ్వరరావుగారితో పోలిక వచ్చినపుడు నాగేశ్వరరావు వేసిన పాత్రలు ఆ తరువాత శోభన్బాబు వేశారు, తర్వాత నాగార్జున వేశారు, జగపతిబాబు వేశారు. ఏదో ఒక స్థాయిలో, ఎంతోకొంత దూరంలో నాగేశ్వరరావుగారి స్థానానికి చేరువగా వచ్చారు. కానీ ఎన్టీయార్ పౌరాణిక పాత్రల దగ్గరకి వచ్చేసరికి ఆయనలా ఒప్పించినవారు అరుదు. కాంతారావుగారూ కృష్ణుడు వేశారు, హరనాధ్ వేశారు. బాగానే వేశారు. ‘సంపూర్ణరామాయణం’లో శోభన్బాబూ వేసి నప్పించారు. రావణుడిగా, దుర్యోధనుడుగా, కీచకుడిగా ఎస్వీ రంగారావు గొప్పగా రాణించారు. అయితే ఎన్టీ రామారావు ఒక్కరే అన్ని రకాల పౌరాణిక పాత్రల్లోనూ నప్పారు.

రామారావు తొలి పౌరాణికం ‘మాయారంభ’. మాయాబజార్ ఆయన రెండో పౌరాణికం. కృష్ణుడుగా ఆయన కేలండర్ల కెక్కినది ఆ సినిమాతోనే. అప్పటిదాకా కృష్ణుడంటే ఈలపాట రఘురామయ్య గారే. కెవి రెడ్డిగారు ఈయనకు కృష్ణుడి వేషం యిచ్చి కిరీటం స్టయిల్ మార్పించారు. ఫుల్ క్రౌన్ పెట్టారు. అందులో నెమలి ఈకల గుత్తి పెట్టారు. ఈయన ఛాతీ కనబడేట్టు చూశారు. మేకప్ పూర్తి చేసి బయటకు తీసుకొచ్చేసరికి అందరూ ఈయన అందానికి ‘వాహ్’ అన్నారు. ఇక అప్పణ్నుంచీ కృష్ణుడంటే ఎన్టీయారే అనుకునే స్థితికి తీసుకు వచ్చారు. మన తెలుగువాళ్లకు నిజం కృష్ణుడు ప్రత్యక్షమైనా అతను ఎన్టీయార్ పోలికల్లో లేకపోతే నువ్వెవరో మాకు తెలియదు పొమ్మంటాం. కృష్ణుడిగా ఆ చిరునవ్వు, కొంటెతనం లెజెండరీ అయిపోయాయి.

ఆ తర్వాతిది పౌరాణికం – పాండురంగ మహాత్మ్యం. అయితే అందులో ఈయనది దేవుడి పాత్ర కాదు. భక్తుడి పాత్ర. మరో పౌరాణికం వినాయక చవితి. మళ్లీ కృష్ణుడి పాత్ర. ఆ తర్వాతది భూకైలాస్ – రావణాసురుడి పాత్ర. ప్రతినాయకుడే కానీ సినిమాకు నాయకుడు కూడా. కథంతా అతనిమీదనే తిరుగుతుంది. భక్తుడిగా, అహంభావిగా, మూర్ఖుడిగా రకరకాల భావాలు చూపే అవకాశం వచ్చింది.

తర్వాత వచ్చిన పౌరాణిక సినిమా వెంకటేశ్వర మహాత్మ్యం. వెంకటేశ్వరుడి పాత్రలో ఎన్టీయార్ నీరాజనాలు అందుకున్నారు. తర్వాత దీపావళి. మళ్లీ కృష్ణుడి పాత్ర. ఆ తర్వాత వచ్చినది సీతారామ కళ్యాణం. రావణాసురుడిగా విజృంభించిన సినిమా. తిక్కనగారి ఉత్తరరామాయణం నుండి కథ తీసుకుని రావణుడి వృత్తాంతం బ్యూటిఫుల్గా చెప్పారు. రామారావే దర్శకుడు. అయితే దర్శకుడిగా ఆయన పేరు వేసుకోలేదు.

తర్వాతి సినిమా భీష్మ. భీష్ముడి యవ్వనం నుంచి వార్ధక్యం వరకు అన్ని స్టేజీల్లోనూ ఎన్టీయార్ అద్భుతమైన నటన కనబరచారు. చక్రపాణిగారి జోక్ వినే వుంటారు. ఆయన వద్దన్నా ఈయన ముసలి భీష్ముడిగా వేసి తనలో నటనా తృష్ణను తీర్చుకున్నారు. దక్షయజ్ఞంలో శివుడిగా వేసినప్పుడే ఆయన పెద్ద కుమారుడు రామకృష్ణ ఆకస్మికంగా పోయాడు. చికెన్పాక్స్ వచ్చి పోయారు. లయకారకుడైన శివుడి వేషం వేయబట్టే తనకు యిలాటి విషాదం కలిగిందనుకున్నారు ఎన్టీయార్.

శ్రీ కృష్ణార్జునయుద్ధంలో శ్రీకృష్ణుడిగా తన పాత్ర అవలీలగా పోషించారు ఎన్టీయార్. ఇక్కడిదాకా ఆయన రాముడి పాత్ర వేయలేదు. ‘సంపూర్ణ రామాయణం’ అనే తమిళ సినిమాలో తప్ప. 1963లో వచ్చింది ‘లవకుశ’. రామారావు రాముడి అవతారంలో జనాల్ని వెర్రెక్కించేశారు. ఆ సినిమా ఏడాదిన్నర ఆడింది. ప్రజల మనసులో రాముడిగా ఆయన తిష్ట వేసుకున్నారు. ఆ తర్వాత చెప్పుకోవలసినది నర్తనశాల. అర్జునుడిగా వేయడం సరే. అలాటివాటికి ప్రయత్నమే అక్కరలేదనిపిస్తుంది.

కానీ బృహన్నల వుంది చూశారూ, అది భలే కష్టం. అంత పెర్సనాలిటీ వున్న మనిషి, ఆడ కులుకులు పోతూ నపుంసకుడిగా వేయడం తలచుకుంటే చాలా ఎబ్బెట్టుగా వుంటుంది. కానీ ఈయన తన ప్రతిభతో దాన్ని ఒప్పించారు. దానికోసం ఎంతో కష్టపడి నాట్యం నేర్చుకున్నారు. పాండవ వనవాసంలో భీముడి పాత్ర ఒప్పుకోవడం విశేషం. నర్తనశాలలో వేసిన దండమూడి రాజగోపాలరావును పెట్టినా సరిపోయేది. కానీ స్టార్ వాల్యూ కోసం ఈయన్ని తీసుకున్నారు. భీముడు, ద్రౌపది మధ్య డ్యూయట్ పెట్టడం చక్రపాణిగారి సజెషన్ .

‘ఎన్టీయార్, సావిత్రిని పెట్టుకుని ఓ డ్యూయెట్టయినా పెట్టక పోతే ఎట్టా?’ అన్నాట్ట ఆయన. వీరాభిమన్యులో మళ్లీ కృష్ణుడి పాత్రే. ఆ తర్వాత వచ్చినది శ్రీ కృష్ణపాండవీయం. దుర్యోధనుడిగా, కృష్ణుడిగా ఎన్టీయార్ ద్విపాత్రాభినయం. సీతారామకల్యాణంలో రావణుడికి గ్లేమర్ తెచ్చి పెట్టినట్టు దీనిలో దుర్యోధనుడికి గ్లేమర్ తెచ్చిపెట్టారు. కర్ణ సినిమాలో దుర్యోధనుడికి డ్యూయెట్ పెట్టేరు.

దుర్యోధనుడిగా, కర్ణుడిగా, కృష్ణుడిగా రామారావు ఒంటిచేత్తో సినిమాను నిలబెట్టారు. విరాటపర్వం వేసినప్పుడు ఈయన వేసిన అయిదు పాత్రల్లో కీచకుడు కూడా ఒకటి. కృష్ణుడిగా రామారావు సినిమాల్లో విశ్వరూపం చూపించినది శ్రీ కృష్ణావతారం. శ్రీకృష్ణ తులాభారంలో కూడా ఆయనా, జమునా, కాంతారావు సినిమాను నిలబెట్టేశారు. ఏ పౌరాణిక పాత్ర వేసినా ఆయన భక్తి శ్రద్ధలతో వేసినట్టు కనబడుతుంది. ఎక్కడా అతి కనబడదు.

ఎన్టీయార్ జానపద సినిమాల్లో ఎన్నదగినవి చూద్దాం. మొట్ట మొదటి జానపదం పాతాళభైరవి. తోటరాముడిగా ఆయన జాక్పాట్ కొట్టారు. ఇక అక్కణ్నుంచి సినిమాలే సినిమాలు. అందాల రాకుమారుడు అంటే రామారావే! తర్వాతది రేచుక్క. ప్రతిభా వాళ్ల సినిమా. అప్పటిదాకా నాగేశ్వరరావుతో జానపదాలు తీసిన ప్రతిభావాళ్లు రామారావును పెట్టి ‘రేచుక్క’ తీశారు. నాగేశ్వరరావు ఓ గెస్ట్రోల్ వేశారు.

తర్వాత జానపదం జయసింహ. ఎన్టీయార్కి ముందునుండీ అభ్యుదయ భావాలున్నాయి. సాంఘిక ప్రయోజనం వున్న సినిమాలు తీయాలి అనుకుని, సినిమా రంగానికి వచ్చిన 3,4 యేళ్లలోనే ‘పిచ్చిపుల్లయ్య’, ‘తోడుదొంగలు’ వంటి మంచి సినిమాలు తీశారు. అదే నాగేశ్వరరావుగారయితే ఫీల్డుకి వచ్చిన పాతికేళ్లకు ‘సుడిగుండాలు’ ‘మరోప్రపంచం’ తీశారు. అయితే ఎన్టీయార్ తీసిన రెండు సినిమాలూ దెబ్బ తిన్నాయి. అందువల్లనే జయసింహ రూపు దిద్దుకుంది. బ్రహ్మాండమైన హిట్ అయింది. ఎన్.ఏ.టి.సంస్థ నిలబడింది. అనేక మంచి సినిమాలు తీసింది .

ఎన్టీయార్ వేసిన జానపదాల్లో చెప్పుకోదగ్గవి – జయం మనదే, వీరకంకణం, రాజనందిని, రేచుక్క-పగటిచుక్క, బాలనాగమ్మ, రాజమకుటం…, రాజమకుటం గురించి ఓ మాట చెప్పాలి. చాలా గొప్ప జానపద సినిమా అది. ఆ సినిమా తీసినది బియన్ రెడ్డిగారు. షూటింగు టైములో జరిగిన ఓ విశేషం ఏమిటంటే – రామారావు, స్టంట్ సోము వాళ్లు ఓ ఫైటింగ్ సీను ప్రాక్టీసు చేస్తున్నారట. శాండిలియర్ పట్టుకుని ఊగడం అదీ నన్నమాట. బియన్ రెడ్డి గారు వచ్చి ‘నో నో మిస్టర్ రామారావ్, డోంట్ టేక్ రిస్క్. నీకేమైనా అయితే నీతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లందరూ నష్టపోతారు. ఇలాటి సాహసాలు చేయకు.’ అని అడ్డుపడ్డారు .

‘సార్, మీరు బయటకు వెళ్లి కూచోండి. మా తంటాలు ఏవో మేం పడతాం. ఫైట్స్ అయిపోయాక మిమ్మల్ని పిలుస్తాం’ అని ఆయన్ను బయటకు పంపించి వీళ్లు ఫైట్ సీన్లు షూట్ చేశారు. అలా రిస్క్ తీసుకు చేశారు కాబట్టే ఎన్టీయార్ తెరమీద కనబడగానే ఈల వేయ బుద్ధయ్యేది. ఆ రిస్కు తీసుకునే క్రమంలో యాక్సిడెంట్లూ అవుతాయి, తప్పదు. ఆక్యుపేషనల్ హజార్డ్. తర్వాతి సినిమాల్లో – భట్టి విక్రమార్క, జగదేకవీరుని కథ, గులేబకావళి కథ, స్వర్ణమంజరి, అగ్గిపిడుగు, మంగమ్మ శపథం, పరమానందయ్య శిష్యులకథ ఇవన్నీ చెప్పుకోవచ్చు. పరమానందయ్య శిష్యుల కథలు ఆంధ్రదేశంలో పాప్యులర్ అయినా వాటిని అలనాటి హాస్యనటుడు కస్తూరి శివరావు సినిమాగా తీస్తే ఫెయిలయిపోయింది. కొత్త వెర్షన్ మంచి హిట్ అయింది. రామారావు గ్లామర్ మహిమ అది.

విఠలాచార్య, రామారావు కాంబినేషన్లో బోల్డు జానపద సినిమాలు వచ్చి బాక్సాఫీసులు బద్దలు కొట్టాయి. ఎ క్లాసు సెంటర్లలోనే కాదు, బి, సి సెంటర్లలో కూడా బాగా ఆడేవి. రిపీట్ ఆడియన్సు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు. అగ్గి బరాటా, కంచుకోట, గోపాలుడు-భూపాలుడు, భువనసుందరి కథ, భామా విజయం, చిక్కడు-దొరకడు, రాజకోట రహస్యం, లక్ష్మీ కటాక్షం, ఆలీబాబా 40 దొంగలు, గండికోట రహస్యం ఇలా ఎన్నో సినిమాల్లో రామారావ్ మ్యాజిక్ అద్భుతంగా పనిచేసింది.

ఈ ప్రేక్షకులే తర్వాత ఓటర్లుగా మారారు. తెరమీద చేసిన అద్భుతాలను ఎన్టీయార్ రాజకీయరంగంలో కూడా చేయగలడని నమ్మారు. నమ్మినట్టే అప్పటిదాకా ఏ రాజకీయవేత్తా చేయలేని పనులను ఎన్టీయార్ చేసి చూపించారు.

1972 నాటికి ఆయన ‘బడిపంతులు’ సినిమాలో అద్భుతంగా నటించారు. అంటే సినిమా ఫీల్డుకి వచ్చి 23యేళ్లు. ఆయనకు 49యేళ్లు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హిందీ సినిమాల తెలుగు వెర్షన్లో వేయడం మొదలెట్టారు. జంజీర్- నిప్పులాంటి మనిషి, దీవార్ – మగాడు, యాదోంకీ బారాత్ – అన్నదమ్ముల అనుబంధం. యిలా. ఎదురులేని మనిషి వచ్చింది. స్టెప్స్ వేయడం మొదలయింది. ఈ ధోరణిలో సాగుతూండగానే అడవిరాముడు వచ్చింది. సూపర్ డూపర్ హిట్. అంతే, యిక అక్కణ్నుంచి యమగోల, వేటగాడు, డ్రైవర్ రాముడు, ఆటగాడు, సూపర్మాన్ – ఒకటా, రెండా. యివన్నీ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈయన తీసిన పౌరాణికాలంతగా విజయవంతం కాలేదు, మారుతున్న ప్రేక్షకుల అభిరుచి కారణంగా.

రామారావు యంగ్ జనరేషన్కి చేరువైంది యీ సినిమాల ద్వారానే. వాళ్లే ఆయనకు రాజకీయాల్లో వోట్బ్యాంక్ అయ్యారు. ఇక చివరికి వచ్చేసరికి బొబ్బిలిపులి, కొండవీటి సింహం – ఒక రకంగా చెప్పాలంటే ముందు తరంలోని పౌరాణిక పాత్రల చిత్రీకరణ ఈ తర్మలో సాంఘికాలలో రూపొందించారు.

గొప్ప నటుడు, రచయిత, మంచి దర్శకుడు, అభిరుచి గల నిర్మాత అయిన రామారావుకు కెరియర్ ప్లానింగ్ అవసరమూ పడలేదు. నాగేశ్వరరావుగారి కయితే తనకు సూటయ్యేవి ఏవి అని వెతుక్కోవడం అదీ వుండింది. ఈయన ఏవి వస్తే అవి వేసేయడమే! జంకు, గొంకులేదు.

తోడుదొంగలు సినిమా నాటికి ఎన్టీయార్కు 30 యేళ్లు. అందులో ఆయన 60 యేళ్ల ముసలివాడి పాత్ర వేశారు. ఆయన కొడుకు చలం, భార్య హేమలత. ఇప్పుడు చెపితే నమ్మరు కదూ. అదే టైములో ‘అగ్గిరాముడు’ వంటి మంచి స్వాష్బక్లింగ్ హీరోగా వేస్తూ పక్కన యిది వేస్తే ఇమేజి పోతుందేమోనన్న చింతే లేదు. వినోదావారి ‘కన్యాశుల్కం’లో గిరీశం పాత్ర యిస్తే నాగేశ్వరరావుగారు వద్దనేశారు విలనిక్ షేడ్ వుందని. ఈయన వేశారు. అలాగే ‘చింతామణి’లో వేశ్యకు విటుడిగా బిల్వమంగళుడు పాత్ర. ఆయన వద్దన్నాడు, ఈయన సరేనన్నారు.

అన్నిటికన్నా ఆశ్చర్యం – రాజూపేదలో పాత్ర. ఆ సినిమాలో ఈయన పాత్ర ఓ దరిద్రుడి పాత్ర. మోస్ట్ అన్గ్లామరైజ్డ్ పాత్ర. చింకి గుడ్డలు కట్టుకున్న చిల్లరమల్లర దొంగ, తాగుబోతు, పెళ్లాం పిల్లల్ని పట్టుకుని కొట్టడం తప్ప చేసేదేమీ లేదు. సినిమా చివర్లో గుర్రం మీద వెళ్లి విలన్తో పోట్లాడ్డం తప్ప! ‘దాసి’లోనూ అన్గ్లామరైజ్డ్యే! ‘భీష్మ’లో ముసలిపాత్రలోనే ఎక్కువసేపు కనబడతారు. ‘కలిసివుంటే కలదు సుఖం’లో అవిటివాడి పాత్ర. ‘నర్తనశాల’లో ఇందాకా చెప్పుకున్నట్టు ఆడంగి పాత్ర. ‘చండీరాణి’ లో హీరోయిజం చూపించేదంతా భానుమతే!

నిజానికి మంచి పాత్రలు వేయాలన్న తపన మహా ఎక్కువ. ‘భూకైలాస్’లో ‘సీతారామ కల్యాణం’లో రావణాసురుడిగా వేసిన తర్వాత ‘సతీ సులోచన’లో ఎస్వీయార్ రావణుడిగా, ఎన్టీయార్ ఇంద్రజిత్గా వేశారు. ‘పాండవ వనవాసం’లో ఎన్టీయార్ భీముడయితే ఎస్వీయార్ దుర్యోధనుడిగా వేసి అదరగొట్టేశారు. అది చూసి ఈయన కృష్ణపాండవీయం’లో దుర్యోధన పాత్ర వేసి పేరు తెచ్చుకున్నారు. ‘శ్రీమత్ విరాటపర్వం’ తీసి దానిలో కీచకుడు పాత్ర వేశారు.

‘సతీ సావిత్రి’లో యముడు ‘అక్బర్, సలీం, అనార్కలి’ లో అక్బర్ గా, రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత బాపుగారిచేత ‘శ్రీనాథ’ తీయించుకుని అందులో వేషం వేస్తే తప్ప ఆయనలోని కళాకారుడు శాంతించలేదు.

తమిళంలో తీసిన ‘కర్ణన్’లో శివాజీ గణేశన్ కర్ణుడు. ఈయన కృష్ణుడు. సినిమా బాగా హిట్ అయింది. ఈయన కొన్నాళ్లకి ‘దానవీర శూరకర్ణ’ తీస్తూ కృష్ణుడు, కర్ణుడు దుర్యోధనుడు గా నటించారు.

ఈయన వేసిన చారిత్రక సినిమాలు తక్కువ కాదు. తెనాలి రామకృష్ణలో,మహామంత్రి తిమ్మరసులో కృష్ణదేవరాయలు, సారంగధరలో సారంగధరుడు, బొబ్బిలియుద్ధంలో రంగరాయుడు, పల్నాటియుద్ధంలో బ్రహ్మనాయుడు, చాణక్య చంద్రగుప్తలో చంద్రగుప్తుడు. అసలీ సినిమాలో ఈయన నాగేశ్వరరావుగారికి ఓ ఆఫర్ యిచ్చారు. ‘బ్రదర్, నువ్వు చంద్రగుప్తుడు, నేను చాణక్యుడు వేద్దామా?’ అని. నాగేశ్వరరావుగారు చాలా కాలిక్యులేటెడ్ కదా. ‘వద్దులే, ఇలాగే కానీ’ అన్నారు.

రామారావుగారు ఎన్ని పాత్రలు వేసినా అన్నీ రాజసం వున్నవే. అల్లూరి సీతారామరాజు స్క్రిప్టు రాయించి పెట్టుకుని తాత్సారం చేస్తూ వుంటే కృష్ణ తీసేశారు. ఈయన కొన్ని సినిమాల్లో ఆ వేషధారణలో కనబడతారు.

రామారావుగార్ని పౌరాణికాలూ, జానపదాల్లో బాగా గుర్తు పెట్టుకున్నా ఆయన వేసిన వాటిల్లో సాంఘికాలు ఎక్కువ. కామెడీ ఆయన బాగా వొప్పించారు. పెళ్లిచేసి చూడు, వద్దంటే డబ్బు, మిస్సమ్మ. మిస్సమ్మలో ఎంత సటిల్ హ్యూమరో చూడండి. కన్యాశుల్కంలో గిరీశం పాత్రలో వేయడం మాటలు కాదు. పక్కన అందరూ హేమాహేమీలు. సియస్సార్, విన్నకోట రామన్నపంతులు, సావిత్రి, జానకి. వీళ్లందరి మధ్యా నెగ్గుకొచ్చినందుకే మెచ్చుకోవాలి. పెంకిపెళ్లాం, ఇంటిగుట్టు, అప్పుచేసి పప్పుకూడు, అప్పుచేసి పప్పుకూడు నిండా మారు వేషాలే. దేవాంతకుడు, పెండ్లి పిలుపు, గుండమ్మకథ. గుండమ్మకథ తీసేనాటికి ఆయనకు 40 యేళ్లు.

సినిమా ఫస్ట్ కాపీ చిన్నపిల్లలకు చూపారు. వాళ్లు ఈయన పాత్ర బాగా ఎంజాయ్ చేశారు. ఆ సినిమా హిట్ కావడంతో తర్వాత చాలా సినిమాల్లో అలాటి పాత్రలు వచ్చాయి. కామెడీ సినిమాల్లో చెప్పుకోదగ్గవి – ఇరుగు-పొరుగు, రాముడు-భీముడు, దాగుడుమూతలు. తిక్క శంకరయ్య, యమగోల. యమగోలలో యముడి దగ్గిర డైలాగులు చాలా బాగుంటాయి.

కామెడీ పాత్రల గురించి చెప్పుకున్నాక విషాద పాత్రల గురించి చెప్పుకోవాలి – చిరంజీవులు, ఇంటికిదీపం ఇల్లాలే, ఆత్మబంధువు. ఆత్మబంధువు సినిమా చూస్తే ఇప్పటిక్కూడా ప్రేషకులకు కన్నీళ్లు ఆగవు.

రంగారావు, రామారావు యిద్దరూ పోటీపడి వేశారు. ఇతన్ని ఇంట్లోంచి పొమ్మన్నపుడు వుండే దృశ్యాల్లో ఎంత బాగా చేశారో చెప్పనలవి కాదు. రక్తసంబంధం ఒకటి మంచి టియర్ జర్కర్. రామారావు ముందులో వర్కర్గా అమాయకుడిగా వున్నప్పటి యాక్షన్కీ, ఎదిగి మిల్లు ఓనర్గా మారినప్పటి యాక్షన్కీ ఎంతో వ్యత్యాసం చూపించారు. గుడిగంటలు సినిమాలోది మంచి కాంప్లెక్సు పాత్ర. వెల్ ఎగ్జిక్యూటెడ్. వివాహబంధం, నిర్దోషి, రాము. రాములో మూగవాడి తండ్రిగా చాలా గొప్పగా నటించారు. ఎదురీత కూడా మంచి సినిమా.

ఇక ప్రజలకి ఇన్స్పయిరింగ్ అనిపించే పాత్రల గురించి చెప్పాలంటే – రాబిన్హుడ్ టైప్ పాత్ర అగ్గిరాముడు, శభాష్రాముడు, ఈ సినిమా తర్వాత రిక్షావాళ్లందరూ ఎన్టీయార్ ఫాన్స్ అయిపోయారు. ఎందుకంటే ఇందులో ఆయన పాత్ర రిక్షావాడి పాత్ర. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ పాట పాడే పాత్ర. పోటీలో గెలిచి నెగ్గే పాత్ర. బందిపోటు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. చూస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అలాగే పల్లెటూరి అబ్బాయికి పదును పట్టి వెన్నుతట్టే ఉమ్మడికుటుంబం, కథానాయకుడు సినిమా కథ ముళ్లపూడి వెంకటరమణ గారిది. సంఘాన్ని సంస్కరించే పాత్ర. కామెడీ విలన్లు, వాళ్ల ఆటకట్టించడాలు – ఈ మార్కు సినిమాలకు ఇదేనాంది.

ఇక తర్వాతి ఫేజ్లో వచ్చినవాటిలో డ్రైవర్ రాముడు, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్. సటిల్, సబ్డ్యూడ్ యాక్షన్ చూపిన సినిమాలు వున్నాయి. పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు, ఏకవీర, మా వారి మంచితనం, బడిపంతులు యిలా. రామారావుగారిలో విశేషం ఏమిటంటే ఆయన పౌరాణికాల పాత్రలూ వేశారు. వాటి పారడీలు వేశారు. దేవాంతకుడు, యమగోల, ఉమ్మడి కుటుంబంలో యముడు ఇలా చెప్పుకుపోవచ్చు. ఆయన పాత్రకు ఇంపార్టెన్స్ యిచ్చారు కానీ తనదే పై చేయిగా వుండాలని పట్టుబట్టలేదు. తన 200 వ సినిమా, తన సొంత సినిమాకు ఆయన తన పాత్రపరంగా పేరు పెట్టలేదు.

‘కోడలు దిద్దిన కాపురం’ అని సావిత్రి పరంగా టైటిల్ పెట్టారు. తన పక్కన వాణిశ్రీ. ఆమె ఒక్క కరాటే షాట్ యిస్తే తను పడిపోయినట్టు చూపించుకున్నారు. అప్పటికి వాణిశ్రీ చిన్న హీరోయిన్. ఈయన టాప్లో వున్నారు. బట్ హీ వజ్ షివల్రస్. వెరైటీ రోల్స్కి అవకాశం వచ్చినపుడు అదీ వేశారు – ‘తీర్పు ‘ సినిమాలో జడ్జి పాత్ర అలాటిదే!

ఇలా చెపుతూ పోతే ఎంత స్థలమూ చాలదు. నటుడిగా ఆయన వేయలేని పాత్ర లేదన్నట్టు తనివితీరా వేశారు. టాప్ రాంక్లో వుండగానే రిటైరయ్యారు. దక్షిణాదిన హైయస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా వుండే పొజిషన్లో తప్పుకుని తన సుప్రిమసీని చాటుకున్నారు. ఆయన నటుడు మాత్రమే కాదు, సినిమారంగంలో ఆయనకు తెలియని విభాగం లేదంటారు. రామారావుగారు తన సినిమాల్లో పాటలు దగ్గరుండి ఎలా రాయించుకునేవారో నారాయణరెడ్డిగారు రాసిన పుస్తకంలో చూస్తే తెలుస్తుంది. ఇన్ని పనులు ఆయన ఎలా చేయగలిగారో అని ఆశ్చర్యం వేస్తుంది.

క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ, సమయపాలన. వాటి గురించి వందలాది ఉదాహరణలు చెప్తారు. ఇలా చెప్తూ పోతే అంతే వుండదు. దర్శకుడిగా రామారావు, నిర్మాతగా రామారావు, రాజకీయ వేత్తగా రామారావు.. యిలా ఎన్నో చెప్పవలసి వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *