జ‌న‌సేన‌ ఎంపీగా పోటీ చేయనున్న నాగబాబు?

పవన్‌కళ్యాణ్ అన్నయ్య నాగబాబు జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన్ని గుంటూరు లేదా నర్సాపురం నుంచి పోటీ చేయించాలని పవన్ యోచిస్తున్నారట

  • 1.జనసేన తరపున ఎంపీగా పోటీ చేయనున్న నాగబాబు?
  • 2.గుంటూరు లేదా నర్సాపురం నుంచి పోటీ చేయించాలన్న యోచనలో పవన్.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్‌కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ దూకుడు పెంచింది. అందరికంటే ముందుగా తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 32మంది అసెంబ్లీ అభ్యర్థులను బుధవారం రాత్రి ప్రకటించారు పవన్‌కళ్యాణ్. దీనికి తోడు నేడు రాజమహేంద్రవరంలో ‘యుద్ధ శంఖారావం’ పేరుతో జనసేన ఆవిర్భావ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా పార్టీ మెనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉన్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు.

జనసేనకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. పవన్ సోదరుడు నాగబాబు జనసేన తరపున ఎంపీగా పోటీకి దిగనున్నారంటూ ఓ వార్త రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.

చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టినప్పుడు అన్నయ్యకు చేదోడువాదోడుగా ఉన్న నాగబాబు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు.

అయితే తాజాగా తన అన్నయ్యను లోక్‌సభ ఎన్నికల్లో నిలబెట్టాలని పవన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల గుంటూరులో జనసైనికులతో సమావేశం నిర్వహించిన నాగబాబు తాను సాధారణ కార్యకర్తను మాత్రమేనని చెప్పారు.

అయితే గుంటూరు పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆయన ఈ సమావేశం నిర్వహించినట్లు కొందరు చెబుతున్నారు.

పోటీకి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన్ని లోక్‌సభ బరిలో దించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారట. గుంటూరు లేదా నర్సాపురం నుంచి ఆయన్ని పోటీ చేయించాలని యోచిస్తున్నారు.

నాగబాబు ఎంపీగా పోటీచేస్తే దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మేలు చేస్తుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. మరి నాగబాబు పోటీకి సై అంటారో.. నై అంటారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *