రైతులు కట్టాల్సిన ప్రీమియం.. ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం స్పష్టం..

019-20 నుంచి రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ రైతు బీమా అమలవుతోంది. బీమా పరిహారం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని సీఎం జగన్ అన్నారు.
రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
ఏపీలో రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించింది. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ చెల్లింపులు ప్రారంభించారు.
13 జిల్లాల్లోని 5,94,005 మంది రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు నేరుగా డబ్బు జమ చేశారు. 2019-20 నుంచి రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ రైతు బీమా అమలవుతోంది. బీమా పరిహారం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని సీఎం జగన్ అన్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు జగన్. రైతులు కేవలం రూపాయి కడితే రైతులు భరోసా కేంద్రంలోనే ఈ– క్రాపింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్ కలిసి ఈ– క్రాపింగ్ రిజిస్టర్ చేసి.. వెంటనే ఇన్సూరెన్స్ను కట్టేలా ఏర్పాటు చేస్తారన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని.. బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం హయాంలో 2018 రబీ పంటల బీమా కింద ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదు. దీంతో రైతులకు చెందాల్సిన 596.36 కోట్ల రూపాయలను బీమా కంపెనీలు ఆపేశాయి. అప్పటి నుంచి రైతులకు బీమా డబ్బు అందలేదు. టీడీపీ ప్రభుత్వం 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించకుండా ఎగనామం పెట్టిందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయాన్ని సమీక్షల ద్వారా తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్.. వెంటనే కంపెనీలకు బీమా ప్రీమియంను చెల్లించాల్సిందిగా ఆదేశించారు. అయితే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. గత సర్కారు ఎగనామం పెట్టిన పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించాలని నిర్ణయించామంటున్నారు.