ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాలు చెల్లించబోతున్నట్లు..జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే జీతాలు చెల్లించబోతున్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై నెలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు.
శాసన మండలిలో అప్రాప్రియేషన్ బిల్లుకు టీడీపీ ప్రభుత్వం అడ్డుపడటంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాలు చెల్లించబోతున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 6, 7 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ద్రవ్యవినిమయ బిల్లు జూన్ 30వ తేదీ సాయంత్రానికి ఆమోదం పొందడంతో జూలై 1న గవర్నర్కు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను పంపించింది.
ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఏపీ ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఇవాళ శనివారం కావడంతో సోమ, మంగళవారాల్లో జీతాలు, పెన్షన్లు పడే అవకాశం ఉంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చాకే బిల్లులు తయారు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఇటీవలే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం కాకుండా శాసన మండలిలో టీడీపీ నేతలు అడ్డుకున్నారని గుర్తు చేశారు.
దీని వల్లే సకాలంలో జీతాలు ఇవ్వలేకపోయినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు ఈవిధంగా వ్యవహరిస్తున్నారు.
బిల్లులను అడ్డుకోవడమే లక్ష్యంగా సభలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిందని మంత్రి కన్నబాబు అన్నారు.
బిల్లును ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుని ఉద్యోగులకు జీతాలు రాకుండా చేశారన్నారు. ఈ విషయంలో ప్రజలకు, ఉద్యోగులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
క్షమాపణ చెబితే చంద్రబాబు సీనియారిటీని కాపాడుకున్న వారవుతారని పేర్కొన్నారు.