మహిళల ఖాతాల్లో రూ. 18,750 చొప్పున జమ చేయనున్నారు..సీఎం జగన్
పథకం ద్వారా అకౌంట్లలో రూ. 18,750 జమ చేస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు.

పాదయాత్రలో సీఎం జగన్ వెంట నడుస్తున్న మహిళలుఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వైరస్ సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నవరత్నాలు పథకాలను అమలు చేస్తున్నారు.
ఇప్పటికే ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న సీఎం జగన్.. త్వరలోనే ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయనున్నారు.
45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో మహిళల ఖాతాల్లో రూ. 18,750 చొప్పున జమ చేయనున్నారు.
ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వెల్లడించారు.
ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నారు.
ఆయా వర్గాల్లోని 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలందరికీ ఏడాదికి రూ.18,750 చొప్పున అందిస్తామని, నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
వైఎస్సార్ చేయూత ద్వారా 25 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారని సామినేని ఉదయభాను వెల్లడించారు.
ఆగస్టు 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.
అర్హులైన పేద మహిళలను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందేలా చూడాలని గ్రామ, వార్డు వలంటీర్లకు సామినేని ఉదయభాను సూచించారు.