40 ఏళ్ల తన రాజకీయ జీవితంలోతాను ఎందరో సీఎంలను చూశాను కానీ.. జగన్ లాంటి సీఎంను తానెప్పుడూ చూడలేదన్నారు…బాబు

YS Jagan లాంటి సీఎంను నా జీవితంలో చూడలేదు.. సీఎం ఇల్లు ఎవరి పేరిట ఉంది?: బాబు

Amaravati అనేది ఐదు కోట్ల మంది ఆంధ్రుల సమస్య అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంను తానెప్పుడూ చూడలేదన్నారు.

ఏపీ రాజధాని విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం స్టూడెంట్ జేఏసీతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జగన్‌కు అభివృద్ధి వికేంద్రీకరణ తెలీదన్న బాబు.. రాష్ట్రం నుంచి అనేక సంస్థలు వెనక్కి వెళ్తున్నాయన్నారు.

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎందరో సీఎంలను చూశాను కానీ.. జగన్ లాంటి సీఎంను చూడలేదంటూ చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌ లాంటి నగరం కోసమే అమరాతి నిర్మాణాన్ని ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు.

ఎవరూ రాజధానులు మార్చిన చరిత్ర లేదన్న బాబు.. అమరావతిలో కోర్టు, సచివాలయం, అసెంబ్లీ సహా అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు.

రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో పాలన ప్రారంభించినప్పటికీ.. ఏనాడూ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఆపలేదని చంద్రబాబు గుర్తు చేశారు.

ప్రజలను చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యత విద్యార్థులపైన ఉందన్నారు.

అమరావతి విషయంలో ఎందుకు కుల ప్రస్తావన తీసుకొస్తున్నారని బాబు ప్రశ్నించారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

అలాంటప్పుడు సీఎం ఇల్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదా..? ఆ ఇల్లు జగన్ పేరిటే ఉందని చూపించగలరా? అని బాబు ప్రశ్నించారు.

జగన్ చర్యల వల్ల మన ఉనికికే ప్రమాదం వాటిల్లుతోందన్న బాబు.. అభివృద్ధి నిలిచిపోయిందని, సామాన్యుడిపై భారం పెరుగుతుందన్నారు.

అనంతపురం వాళ్లకు విశాఖపట్నం కంటే తిరువనంతపురం దగ్గర అవుతుందన్నారు.

మూడు రాజధానుల వల్ల పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని చంద్రబాబు హెచ్చరించారు.

ఇవన్నీ రేపు అనుభవంలోకి వస్తే అర్థం అవుతుందన్నారు. మంత్రులు అమరావతిలో ఉంటే, సెక్రటేరియట్‌ విశాఖలో ఉంటుంది..

ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎక్కడికి వెళ్లాలని బాబు ప్రశ్నించారు. రేపు ఏదైనా లిటిగేషన్ వస్తే.. ఊరూరా తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

తలా తోకా లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని జగన్ సర్కారుపై ఆయన మండిపడ్డారు.

జగన్ ఎక్కడ చదువుకున్నారో కూడా చెప్పలేరన్న బాబు.. సీఎం తన నాలెడ్జ్ మొత్తాన్ని మన మీద ప్రయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు.

మన కోసం మనం బతకడమే కాదు.. సమాజం కోసం కూడా ఆలోచించాలన్న చంద్రబాబు..

నేను మీకోసం, భావితరాల కోసం పోరాడుతున్నానన్నారు.

ఈ విషయాన్ని యువత ఆలోచించాలన్నారు. పోరాడకపోతే.. అడ్రస్ చెప్పుకోవాలన్నా సిగ్గు పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల సమస్య అన్న చంద్రబాబు.. మూడు రాజధానుల ఏర్పాటు చట్ట ఉల్లంఘన అన్నారు.

ఐదు కోట్ల మంది ప్రజల కోసం చేసే పోరాటానికి రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని బాబు పిలుపునిచ్చారు. ఈ సంక్రాంతి అమరావతి సంక్రాంతిగా మిగిలిపోవాలన్నారు.

అమరావతి కోసం పోరాడుతున్న రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారని బాబు ఆరోపించారు.

‘మహిళలపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. మనం పట్టించుకోకపోతే.. వాళ్లను అణచివేస్తారన్నారు.

ఈ రోజు సమస్య నాది కాదని సైలెంట్‌గా ఉంటే.. తర్వాత మీకు సమస్య వచ్చినప్పుడు స్పందించడానికి ఎవరూ ఉండర’ని బాబు హెచ్చరించారు.

అందరం కలిసి పోరాడుదాం.. అమరావతిని కాపాడుకుందాం అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *