ఒకవేళ మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్తే మాత్రం…!జగన్ సర్కార్ ముందు టీడీపీ నిలబడుతుందా? చంద్రబాబు అసలు ఏం ఆలోచిస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారంగా మారాయి. మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ పడటంతో టీడీపీ మింగలేక కక్కలేక ఉంది.

అదే సమయంలో అమరావతి కోసం రాజీనామా విషయంలో బాబు మాటకు ఎమ్మెల్యేలు నిజంగా రాజీనామా చేస్తారా?

ఒకవేళ మళ్లీ ఎన్నికలకు వెళ్తే టీడీపీ నిలబడుతుందా? చంద్రబాబు అసలు ఏం ఆలోచిస్తున్నారు? టీడీపీ అధినేత ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నారు?

ఇరువర్గాలకు సవాళ్లేనా? సాధించేది ఏమైనా ఉందా? అనే విషయాలను గురించి ఇప్పుడు ఏపీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి.

అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి చుట్టూ ఏపీ రాజకీయం వేడెక్కింది.

రాజీనామాల సవాళ్లు, ఛాలెంజ్ ‌లు తీవ్రంగా సాగుతున్నాయి. డెడ్‌ లైన్లు పెట్టే వరకూ వెళ్లి తీవ్రతరమైన వేడి పుట్టిస్తోంది.

దీంతో ఏపీలో మళ్లీ ఎన్నికల సీన్‌ కనిపిస్తోందా? అన్నంత చర్చ సాగుతుంది. దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి..

మీరు గెలిస్తే మళ్లీ అమరావతి ఊసే ఎత్తం అని మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ సవాల్‌ విసిరారు.

తర్వాత అనేక మంది మంత్రులు, వైసీపీ నేతలు ఇదే డిమాండ్‌తో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఇలాంటి సమయంలో ఇప్పడు ఎన్నికలకు వెళ్తే… 23సీట్లు వైసీపీ ఖాతాలోకి వచ్చే ప్రమాదం లేకపోలేదు!

ఒకవేళ వైసీపీ ట్రాప్‌ లోకి చంద్రబాబు వెళ్లి.. టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఏమౌతుందనే చర్చ కూడా రసవత్తరంగా సాగుతుంది.

నంద్యాలలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాడు గెలిచారో.. టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో వైసీపీ అలాగే గెలుస్తుందని కలవర పాటుకు గురౌతున్నారు తెలుగు తమ్ముళ్లు.

అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కూడా ఓడిపోవడం ఖాయమనే టాక్ నడుస్తోంది. 23 సీట్లూ జగన్‌కే వస్తాయని టీడీపీ భావిస్తోంది!

గతంలో కాంగ్రెస్‌ పార్టీతో విభేదించి ఉప ఎన్నికలకు వెళ్లిన జగన్‌ ఐదు లక్షలకుపైగా మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు.

అమరావతి ఎపిసోడ్ ‌లో మాత్రం చంద్రబాబు మెలిక పెట్టి తప్పించుకున్నారనే కామెంట్స్‌ బాగా వినిపిస్తున్నాయి.

ఒకవేళ చంద్రబాబు ఒప్పుకొని ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే.. రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టడం అంత ఈజీ కాదు.

ప్రజాకర్షక పథకాలు చాలా అమలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. నిధులు కుమ్మరిస్తోంది. ఓటు బ్యాంక్‌ను సాలిడ్‌ చేసుకుంటోంది.

అందువల్ల చంద్రబాబు ఉప ఎన్నికలు అనే పని చేయబోరని ఓ వర్గం వాదిస్తోంది.

వైసీపీకి ప్రస్తుతం 151 సీట్లు ఉన్నాయి. చంద్రబాబు సవాల్‌ చేశారని వైసీపీ వాళ్లు ఇప్పుడు ఎన్నికలు తెచ్చుకోరు.

అలాగే తొందరపడి చంద్రబాబు అండ్‌ బ్యాచ్‌ రాజీనామా చేస్తే టీడీపీ అడ్రస్‌ ఉండదు. ఫైనల్‌ గా జరగబోయేది ఏంటంటే.. ప్రత్యేక హోదాలాగే రాజీనామాలు ఎటూ జరగవు!

మధ్యలో ప్రజలకు పొలిటికల్ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ మాత్రం బాగా ఉంది.

అంతేకాకుండా చంద్రబాబు ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అప్పట్లో రాజీనామా చేసిన గులాబీ దళపతి కేసీఆర్‌ కూడా ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు దుముకారు.

సక్సెస్ కొట్టారు. అప్పట్లో పీసీసీ చీఫ్ ‌గా ఉన్న ఎం. సత్యనారాయణరావు ఛాలెంజ్‌ ను సవాల్‌ గా తీసుకుని కేసీఆర్‌ రాజీనామా చేశారు.

నాటి నుంచి అనేక సందర్భాలలో తేల్చుకుందాం అంటే తేల్చుకుందాం అన్నట్లుగా ఉండేది కేసీఆర్ వైఖరి. అలాంటి ధైర్యం చంద్రబాబు చేస్తారేమోనని పార్టీ వర్గాలు భయపడ్డాయి.

కానీ అబ్బే అలాంటి అలవాటు చంద్రబాబు రక్తంలోనే లేదు.. బాడీ ఒప్పుకున్నా బ్లడ్ ఒప్పుకోవడం లేదు అని కూడా ఆ పార్టీ వర్గాలనుంచే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి!

కేసీఆర్, జగన్ లా బాబు కావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే అన్న కామెంట్లు ఈ సమయంలో కొసమెరుపు!

తెగువ, ధైర్యం, పట్టుదల, అంతకుమించిన సంకల్పబలం మెండుగా ఉండాలి. మొత్తానికి అలా చల్లబడిపోయిన చంద్రబాబు రక్తం హైదరాబాద్ లో కూర్చొని సవాళ్లమీద సవాళ్లు జూమ్ లో చేసేస్తుంటే ఎలా…. తమ్ముళ్ల ఆవేదన?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *