టీడీపీతో కయ్యం….కాంగ్రెస్తో వియ్యం
టీడీపీ ప్రాణం తీసి.. కాంగ్రెస్ని బతికిస్తారా.?
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నది వాస్తవం. రాజకీయంగా ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సమాధి కట్టేశారు.
2014 ఎన్నికల్లో జరిగిందీ ఘటన. అడ్డగోలు విభజనతో 13 జిల్లాల్ని నిర్దాక్షిణ్యంగా అభివృద్ధికి దూరంచేసిన కాంగ్రెస్ పార్టీని, రాజధాని లేకుండా.. 13 జిల్లాల్ని అనాధగా మార్చేసిన కాంగ్రెస్ పార్టీని.. రాష్ట్ర ప్రజానీకం రాజకీయంగా చంపేశారు. ఇందులో ఇంకో మాటకు తావులేదు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. లాంటి సాధారణమైన మాటల్ని ఇక్కడ ఉపయోగించడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్కి ఆ స్థాయిలో అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ కారణంగా.
ఈ విషయాన్ని ఇంకెవరో కాదు, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే ఊరూవాడా చాటింపువేసి మరీ చెప్పారు. కానీ, ఇప్పుడు అదే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కడుతున్నారు. పైగా, కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్లో బతికిద్దామనుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ చచ్చిపోయినా చంద్రబాబుకి పెద్దగా ‘ఫికర్’ వుండదేమో.!
కేఈ కృష్ణమూర్తి కావొచ్చు, చింతకాయల అయ్యన్న పాత్రుడు కావొచ్చు.. చంద్రబాబు ఆలోచనల్ని చాలా గట్టిగా ఖండించేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో వారలా మాట్లాడుతున్నారా.? అన్నది వేరే చర్చ. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలనే నిర్ణయానికే వచ్చేశారు.
కాంగ్రెస్ – టీడీపీ పొత్తు వద్దనుకునేవారెవరైనాసరే.. టీడీపీని వదిలి వెళ్ళిపోవచ్చన్నమాట. చంద్రబాబు దాదాపుగా ఈ సంకేతాలు పంపేశారు.
అంతా నా ఇష్టం.. పొత్తులపై నిర్ణయం నేనే తీసుకుంటాను.. అప్పటిదాకా ఎవరూ మాట్లాడొద్దు..’ అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హర్ట్ అయ్యారు. పైగా, వర్ల రామయ్య లాంటోళ్ళు నీతులు చెబుతోంటే కేఈ తట్టుకోలేకపోతున్నారు. అసలే 2014 నుంచి ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం, మంత్రి పోస్ట్లు వున్నా.. కేఈ కృష్ణమూర్తికి ఎదురవని అవమానాల్లేవు చంద్రబాబు కారణంగా. ప్రతిసారీ సర్దుకుపోతున్నారాయన.
కేఈ కృష్ణమూర్తికి కావొచ్చు, మరొకరికి కావొచ్చు.. చంద్రబాబు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చేశారు. 2019 ఎన్నికల నాటివరకూ కాదు.. ఈలోగానే టీడీపీ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆ సంక్షోభానికి కాంగ్రెస్ – టీడీపీ పొత్తు కారణం కాబోతోందన్నది నిర్వివాదాంశం.
కాంగ్రెస్ని పట్టుకుని 2019 ఎన్నికల్లో గెలిచేద్దామని చంద్రబాబు అనుకుంటున్నారుగానీ.. కాంగ్రెస్తో ఆయన వెళ్ళబోయేది పాతాళంలోకే. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ‘సమాధి’ కాబడ్డ పార్టీ మరి.!