మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు….కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

మా నియోజకవర్గం కర్ణాటకలోనే ఉండేది.. ఇప్పుడు అందులో కలిపేయండి: టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని మార్పు ప్రచారంపై రాజకీయ దుమారం రేగుతోంది.

అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని రైతులు గత రెండు వారాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు మద్దతు తెలుపుతున్నాయి.

రాజధానిని విశాఖకు మారిస్తే తమకు మరింత ప్రయాణభారమవుతుందని రాయలసీమవాసులు స్వరం పెంచుతున్నారు. కర్నూలులో హైకోర్టు వల్ల తమకు ఒరిగేది ఏమీలేదని కొంత మంది నేతలు అంటున్నారు.

ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ నేత తిక్కారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానుల పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి ఆయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.

మూడు రాజధానులతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కర్నూలు పార్లమెంటు స్థానం కర్ణాటకలో ఉండడంతో భాషాపరంగా బళ్లారి జిల్లాలో ఉన్న ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే సహకరించామని అన్నారు.

రాజధానిని విశాఖపట్టణానికి తరలిస్తే రాయలసీమ ప్రజలు అక్కడకు వెళ్లాలంటే 22 గంటల పడుతుందని, పూర్తి మెజారిటీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా చేస్తున్నారని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన చేతకాక రాజధాని పేరుతో ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ హయాంలో ఆర్డీఎస్‌ కుడి కాల్వ, వేదావతి టెండర్లను ప్రస్తుత ముఖ్యమంత్రి రద్దు చేశారని, రాష్ట్రంలో జగన్‌ మోనార్క్‌ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడక ముందు 1956లో తమ ప్రాంతం బళ్లారి జిల్లా ఆదోని తాలుకాలో ఉండేదని, ఇపుడు కర్నాటకలో కలిపేయాలని ఆయన డిమాండు చేశారు.

తమ ప్రాంతంలో అంతా కర్ణాటక సంప్రదాయమే ఉందని, రాజధాని పేర్లతో కర్నూలు, హైదరాబాద్‌, అమరావతి, ఇప్పుడు విశాఖపట్నం తెరపైకి తేవడం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. కాబట్టి, తక్షణమే మంత్రాలయం నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలపాలని ఆయన డిమాండు చేశారు. అవసరమైతే కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమాలు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *