ఎన్నికల తనిఖీలు.. రూ.90 లక్షల హవాలా మనీ సీజ్…
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్లో అక్రమంగా తరలిస్తున్న రూ.90.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లొద్దని పోలీసులు చెప్పారు.
హైదరాబాద్ నగర పోలీసులు మరో హవాలా రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలో నలుగురు వ్యాపారులు అక్రమంగా తరలిస్తున్న రూ.90,50,400 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ రాకెట్ను ఛేదించి.. నలుగురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంగళవారం (మార్చి 12) ఉదయం కాచీగూడ, సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో వేర్వేరు వాహనాల్లో నగదు తరలిస్తున్న వ్యాపారులు పోలీసుల చేతికి చిక్కారు.
దేవేష్ కొటారి అనే వ్యాపారి నుంచి రూ.50 లక్షలు, భక్తి ప్రజాపతి అనే వ్యక్తి నుంచి రూ.23 లక్షలు, నసీం అనే వ్యక్తి నుంచి రూ.5.70 లక్షలు, విశాల్ జైన్ నుంచి రూ.11.80 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
వీటికి సంబంధించి నిందితులు ఎలాంటి ఆధారాలు చూపించలేదని వెల్లడించారు..
నిందితులు కొంత కాలంగా వేర్వేరుగా హవాలా వ్యాపారం నిర్వహిస్తూ.. డబ్బులు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని సీపీ అంజనీకుమార్ తెలిపారు.
వీరి వద్ద నుంచి మూడు క్యాష్ కౌంటింగ్ యంత్రాలతో పాటు 4 బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రూ.50 వేలకు మించి ఎక్కువ నగదును వెంట తీసుకెళ్లవద్దని.. నగదుకు తగిన ఆధారాలు చూపాలని సీపీ తెలిపారు.