ఆలస్యం కానున్న కౌంటింగ్.. అర్ధరాత్రి తర్వాతే అధికారిక ఫలితం

మే 23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే అర్ధరాత్రి తరువాత తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉందని, దీనికి కనీసం 14 నుంచి 16 గంటల సమయం పడుతుందని

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుతో ఆలస్యం కానున్న ఎన్నికల ఫలితం.

అర్ధరాత్రి తర్వాతే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం.

పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలు ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు.

ఓట్ల లెక్కింపు పూర్తయి అధికారికంగా విజేతను ప్రకటించేందుకు కనీసం 14 నుంచి 16 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. మే 23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే అర్ధరాత్రి తరువాత తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉంది.

గత ఎన్నికల లెక్కింపు ప్రక్రియతో పోల్చితే ఈసారి అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు ప్రక్రియ లేదు. కానీ, ఈసారి మాత్రం స్లిప్పుల లెక్కింపు ప్రవేశ పెట్టడంతో ఈ లెక్క తేల్చడానికే అధిక సమయం పడుతుంది.

ఈవీఎంలలోని ఓట్లను లెక్కించేటప్పుడు ప్రతి రౌండులో రెండు యంత్రాలను ర్యాండమ్‌గా కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఎంపిక చేసి లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సంబంధిత రౌండు ఫలితం ప్రకటిస్తారు.

దీనివల్ల ఒక్కో రౌండు లెక్కింపును పూర్తిచేయడానికి 30 నుంచి 45 నిమిషాలు పడుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. వీటితోపాటు పోస్టల్‌ బ్యాలెట్లు ఈసారి రెండున్నర రెట్లు అధికంగా ఉన్నాయి. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన తర్వాతే ఈవీఎంల లెక్కింపు చేపడతారు.

ఈ రెండూ పూర్తి చేసిన తర్వాతే వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు ఉంటుంది.

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్‌ల చొప్పున లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం సూచనలతో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు ఈసీ ఏర్పాట్లు చేసింది. ఐదు వీవీప్యాట్‌లను ఒకదాని తరువాత మరొకటి లెక్కించాలి. వీటిని పూర్తిగా లెక్కించడానికి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

పోస్టల్‌ బ్యాలెట్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సాయంత్రం 6 గంటల కల్లా పూర్తి చేయగలిగితే, తర్వాత వీవీ ప్యాట్‌ల లెక్కింపునకు మరో ఆరు గంటల సమయం పడుతుంది. అంటే అధికారిక ఫలితం ప్రకటనకు అర్ధరాత్రి పడుతుంది. ఈ సమయం దాటిని తరువాత విజేతను అధికారికంగా ప్రకటించి, ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.

లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలైతే, తొలి రౌండు ఫలితం వెళ్లడికి గంటన్నర పడుతుంది. అంటే అధికారికంగా ఉదయం 9.30 గంటలవుతుందని భావిస్తున్నారు. అక్కడి నుంచి ప్రతి రౌండు 30 నుంచి 45 నిమిషాలలో ముగుస్తుంది.

ఈ లెక్కన 17 రౌండ్లు ఉండే సెగ్మెంట్ల ఈవీఎంల లెక్కింపు పూర్తి చేయడానికి దాదాపు 9 గంటల తీసుకుంటుంది. మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *