ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ ,,మరో ముందడుగు పడింది..3 నెలల్లోనే!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ.. 3 నెలల్లోనే..!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో ముందడుగు పడింది. కొత్త జిల్లాల విషయంపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చైర్మన్గా ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సీసీఎల్ఏ, జీఏడీ సర్వీస్ సెక్రటరీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి సభ్యులుగా ఉండనున్నారు.
కమిటీ కన్వీనర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరిస్తారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
మూడు నెలలోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు విధించింది.
కాగా, రాష్ట్రంలో ప్రతి పార్టమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తామని గత ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇచ్చిన హామీ మేరకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై 25 జిల్లాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అయితే పార్లమెంటు నియోజకవర్గం వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి.
ఈ ప్రతిపాదనకు సంబంధించి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఇది సరైన విధానం కాదని పెదవి విరిచారు. ఈ తరుణంలో జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి ప్రభుత్వం కమిటీ వేసింది.