ఇకపై ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. మరో మూడు నెలల్లో ఉద్యోగాల భర్తీ. సిద్ధంగా ఉండాలన్న సీఎం.
నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
ఇకపై ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని.. వచ్చే జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉంచే ప్రసక్తే లేదని.. జనవరి నెల సమీపిస్తున్నందున నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలన్నారు.
విజయవాడలో సచివాలయ, వార్డు ఉద్యోగాల అభ్యర్థులకు నియామక పత్రాలను అందించిన ముఖ్యమంత్రి..
అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగాల కల్పనలో సరికొత్త రికార్డ్ సాధించామన్నారు సీఎం జగన్. నాలుగు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని.. వాటిలోదాదాపు లక్షన్నరమందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన ప్రతి ఒక్కరూ.. దీనిని ఉద్యోగంలా కాకుండా.. బాధ్యతగా తీసుకోవాలి అన్నారు జగన్.
నిజాయితీగా, లంచాలు లేని, పారదర్శక పాలన అందజేయాలని సూచించారు.
వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు అనుసంధానం కావాలన్నారు. ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు తేవాలని.. ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగుల భుజాలపై పెడుతున్నా.. తన నమ్మకాన్ని ఎవరూ వమ్ము చేయొద్దన్నారు ముఖ్యమంత్రి.
కులం, మతం, పార్టీలు చూడొద్దు.. స్వచ్ఛమైన పాలన అందించేందుకే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ.. గ్రామ వాలంటీర్లు వ్యవస్థ రాష్ట్రానికి రెండు కళ్ల లాంటివి అన్నారు.