ఒకరి పై ఒకరు ఎదురు దాడిలతో చంద్రబాబు వర్సెస్ కేసీఆర్
డేటా చౌర్యం’ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య కుంపటి రాజేసింది. ఎన్నికల ముందర వివిధ రాజకీయ పార్టీలు సర్వేల కోసం సేకరించిన డేటానే ఇప్పుడు ఈ వివాదాలన్నిటికీ కారణం.
తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం పరంగా సేకరించిన డేటాను ప్రైవేటు సంస్థకి అప్పగించి, ఆ సంస్థ సాయంతో వైఎస్సార్సీపీకి చెందిన ఓట్లను తొలగించేస్తోందన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ.
కాదు కాదు, తెలంగాణ రాష్ట్ర సమితితో కుమ్మక్కయి, తమ డేటాను వైఎస్సార్సీపీనే దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందన్నది టీడీపీ ఎదురుదాడి.
అసలేంటి కథ.? అన్నది ఎప్పటికి తేలుతుందోగానీ, ఇప్పటికైతే మాత్రం.. ఇటు టీడీపీ, అటు వైఎస్సార్సీపీ.. తెలంగాణ ప్రభుత్వం ముందు ‘దేహీ’ అనే పరిస్థితికి దిగజారిపోయాయంటూ సోషల్ మీడియా వేదికగా ఓ చర్చ జరుగుతోంది.
అఫ్కోర్స్ ఈ కొత్త వాదనని జనసేన, కాంగ్రెస్ శ్రేణులు తెరపైకి తెచ్చాయన్న వాదనలూ లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి.
కారణం ఏదైతేనేం, తెలంగాణలో కేసులు నమోదయ్యాయి.
రేప్పొద్దున్న చంద్రబాబూ ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదు చేస్తారు.. వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తుంది.
‘కేసీఆర్, వైఎస్ జగన్.. నా దగ్గర కుప్పి గంతులు వేయొద్దు. మీరు ఒక కేసు వేస్తే, నేను నాలుగు కేసులు పెట్టగలను..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒకింత అత్యుత్సాహంతో అల్టిమేటం జారీ చేసేశారు.
చంద్రబాబు గతంలో ఇలాగే, ఓటుకు నోటు కేసు టెన్షన్ నుంచి కొంత ఉపశమనం పొందారు.
అప్పట్లో ఏపీ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి తెచ్చేసరికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వున్నపళంగా ‘సైలెంట్’ అయిపోయిన విషయం విదితమే.
అప్పట్లో ఇరువురి నోళ్ళూ మూయించేసింది ప్రధాని నరేంద్ర మోడీనే అనే వెర్షన్ ఇంకోటి రాజకీయాల్లో ప్రచారంలో వుంది లెండి.
ఇంకోటి రాజకీయాల్లో ప్రచారంలో వుంది లెండి. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ బంపర్ మెజార్టీతో గెలిచారు.
ఇంకో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల వరకూ కేసీఆర్ సర్కార్కి వచ్చిన నష్టమేమీ లేదు.
కానీ, చంద్రబాబు పరిస్థితేంటి.? రేపో మాపో ఆయన పదవి పోతుందని పలు సర్వేలు చెబుతున్నాయి.
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ సర్వేలో నిజమైతే, చంద్రబాబు పనైపోయినట్లే రాజకీయంగా. అప్పుడు చంద్రబాబు, కేసీఆర్ మీద కేసులు పెట్టడానికేమీ వుండదు.. ఇప్పుడు పెట్టినా, ఇంకో రెండు నెలల్లో అవి అటకెక్కిపోవచ్చు.
తన మీదకు ఏదన్నా సమస్య వస్తే చంద్రబాబు వెంటనే, జనాన్ని రక్షణ కవచంగా మార్చేసుకుందామనుకుంటారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు.
జనం తనకు రక్షణగా వుండాలని పిలుపునివ్వడమే కాదు, తమ ప్రభుత్వం గనుక మళ్ళీ రాకపోతే.. ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణకి అమ్మేస్తారంటూ దుష్ప్రచారం సైతం చంద్రబాబు అండ్ టీమ్ వైఎస్సార్సీపీ మీద షురూ చేసేశారు.