యుద్ధ విమానాలతో దాడి.. 300 మంది ఉగ్రవాదులు మటాష్!
పుల్వామా ఉగ్రదాడికి సరైన గుణపాఠం చెప్పాలని కృతనిశ్చయంతో ఉన్న సైన్యం మరోసారి సర్జికల్ దాడులు చేసింది.
వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులతో విరుచుకుపడింది.
12 యుద్ధ విమానాలతో పాక్ భూభాగంలోని ఉగ్రవాదులపై మెరుపుదాడులు.
22 నిమిషాల్లో 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం.
సర్జికల్ దాడులపై నీళ్లు నమిలి, భుజాలు తడుముకున్న పాక్.
పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యలను భారత్ ఆరంభించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి.
నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారి 3.45 గంటలు, పీఓకేలోని ముజఫర్బాద్లోని శిబిరంపై 3.48, చికోటీలో 3.58 గంటలకు మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడిచేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి.
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీకి సర్జికల్ దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ క్లుప్లంగా వివరించినట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సర్జికల్ దాడుల్లో 300 మంది వరకూ ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.
మరోవైపు, వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు బాలకోట్, చకోటి, ముజఫరాబాద్లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
ఈ దాడుల్లో జైషే మహ్మద్కు చెందిన అల్ఫా-3 కంట్రోల్ రూమ్లు ధ్వంసమయ్యాయని తెలిపాయి.
సర్జికల్ దాడులను పాకిస్థాన్ ధ్రువీకరించింది. నియంత్రణ రేఖను అతిక్రమించిన భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి వచ్చాయని,
పాకిస్థాన్ వైమానిక దళం తక్షణమే స్పందించడంతో అది వెనుదిరిగింది అంటూ పాక్ ఆర్మీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.
ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన యుద్ధ విమానం ముజఫరాబాద్ సెక్టార్ నుంచి చొచ్చుకొచ్చిందని, దీనిపై అప్రమత్తమైన తమ వైమానిక దళం భారత విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించింది.
అయితే, అది త్రుటిలో తప్పించుకుందని, తాము ప్రయోగించిన బాంబు బాలాకోట్ సమీపంలో కూలింది. ఇందులో ఎవరూ గాయపడలేదు అంటూ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.