సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల గడుపు సోమవారం (మార్చి 25)తో ముగియనుంది:బీ ఫారాలు అందని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన

మిగిలింది ఒక్కరోజే.. బీ ఫారాలు అందక అభ్యర్థుల్లో ఆందోళన!
మార్చి 18 న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెల్లడి కావడంతో నామినేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. అయితే, శని, ఆదివారాలు సెలవు రావడంతో నామినేషన్కు ఒక్కరోజే గడువు ఉంది.
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల గడుపు సోమవారం (మార్చి 25)తో ముగియనుంది.
శని, ఆదివారాలు సెలవు కావడంతో ఈ రెండు రోజులూ నామినేషన్లు స్వీకరించరు. దీంతో బీ ఫారాలు అందని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకుంది.
నామినేషన్ పత్రాల్లో అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, కుటుంబ వివరాలు, కేసుల తదితర సమాచారం సవివరంగా పొందుపర్చాలి. ఈ వివరాలన్నీ పూర్తిచేయాలంటే కనీసం మూడు నాలుగు రోజులు పడుతుంది.
కాబట్టి బీఫారాలు ముందుగానే అభ్యర్థులకు అందితే వీటిని సిద్ధం చేసుకోడానికి అనువుగా ఉంటుంది.
ముఖ్యంగా ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపర్చాలంటే ఆడిటర్లను సంప్రదించాలి. మంచి ముహూర్తం కావడంతో శుక్రవారం పెద్ద ఎత్తున అన్ని పార్టీల అభ్యర్థులూ నామినేషన్లు వేశారు.
అయితే, ఇంకా జనసేన, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడానికి కారణం బీఫారాలు అందకపోవడమేనని సమాచారం.
ప్రధాన పార్టీల్లో టిక్కెట్ దక్కని ఆశావాహులు చివరి నిమిషంలో పార్టీలు మారుతారని, వీరిలో గుర్తింపు ఉన్న నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించాలనే ఆలోచనతో కొందరికి బీఫారాలు ఇవ్వడంలేదనే వాదన వినిపిస్తోంది.
ఇక, ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించి, బీఫారాలను అందజేశాయి. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ఖరారుచేసి, ఈ మేరకు నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించాయి. కానీ, బీ ఫారాలు మాత్రం ఇప్పటి వరకూ ఇవ్వలేదని టిక్కెట్టు దక్కిన నేతలు అంటున్నారు.