పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జిల్లా నుంచే రైతు భరోసాకు పథకంకు జగన్ శ్రీకారం…

1.రైతు భరోసాకు జగన్ శ్రీకారం.. కౌలు రైతులకు సీఎం శుభవార్త
2.నెల్లూరు జిల్లాలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.

3.పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జిల్లా నుంచే పథకం అమలు చేసిన జగన్ సర్కార్.

వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం ప్రారంభించారు.

అన్నదాతలకు అండగా రైతు భరోసాను అందజేస్తామని పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో ప్రకటించారు. ఇచ్చిన మాటను అమలు చేస్తూ నెల్లూరు జిల్లా నుంచే పథకాన్ని ప్రారంభించారు.

వాస్తవానికి మేనిఫెస్టో ప్రకారం 2020లో పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా.. ఏడాది ముందుగానే అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్‌.

రూ. 12,500కు మరో వెయ్యి పెంచి రూ. 13,500 పెట్టుబడి సాయంగా రైతులకు అందజేస్తున్నామని.. జూన్‌లో రూ. 2000 ఇప్పటికే అందించారని.. మరో రూ. 9,500 అక్టోబర్ నెలలో జమచేస్తారని.. మరో రూ. 2000 సంక్రాంతికి అందించనున్నట్లు తెలిపారు.

అంతేకాదు మరో 3 లక్షలమంది కౌలు రైతులకు రైతు భరోసాను అందజేస్తామన్నారు.

తన పాదయాత్రలో రైతుల ఆవేదన కళ్లారా చూశానని.. వర్షాలు లేక రైతులు పడిన బాధలు చూశాను అన్నారు సీఎం. అందుకే రైతు భరోసా హామీని ప్రకటించి అమలు చేస్తున్నామని చెప్పారు.

దేశంలోని రైతులకు అత్యధికంగా సాయం అందించే పథకం రైతు భరోసా.. రైతు భరోసా సొమ్ము కౌలు రైతుల ఖాతాలో జమ అవుతుంది అన్నారు.

ఎనిమిది నెలలు ముందే రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తున్నామని.. 40 లక్షలమందికిపైగా రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని అందిస్తున్నామని చెప్పారు.

రైతు బిడ్డగా నెల్లూరుకు వచ్చాను అన్నారు జగన్. ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకునేందుకు ఇరిగేషన్ మంత్రి పదవి ఇచ్చానని.. నవంబర్ 15 వరకు కొత్తవారికి ప్రతీ బుధవారం సొమ్ము చెల్లిస్తామన్నారు.

ఇక రైతులకు వచ్చే జులై నాటికి పగటి పూటే 9 గంటల కరెంట్ అందిస్తామని.. 55లక్షలమందికి రైతుల బీమా ప్రీమియం బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.

రైతు బీమా కోసం రూ.2,164కోట్లు కేటాయించామని.. రైతు బీమా బాధ్యత మొత్తం ప్రభుత్వానిదే అన్నారు. రూ.3వేలకోట్లతో ధర స్థిరీకరణ నిధిని తీసుకొచ్చామని.. జులై నుంచి రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.

రికార్డ్ స్థాయిలో రాయితీపై విత్తనాలను పంపిణీ చేశామన్నారు జగన్. యూరియా కొరత ఎక్కడా లేకుండా చేశామని.. చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి.

ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చి ఆదుకుంటున్నామని.. పశు నష్టపరిహారాన్ని కూడా అమల్లోకి తెచ్చాం అన్నారు.

అభివృద్ధి అంటే జీడీపీ లెక్కలే కాదు.. రైతులు బావుంటేనే అభివృద్ధి అయినట్లు లెక్క.. రాబోయే రోజుల్లో గ్రామాల్లోనే వ్యవసాయ షాపులు పెడతామని చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల్ని షాపుల నుంచి అందిస్తామని.. పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *