ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో బుధవారం పర్యటిస్తున్నారు…
నేడు కుప్పానికి సతీసమేతంగా బాబు.. ప్రత్యేకత ఇదే!
రాజకీయ పర్యటనలతో బిజీగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో బుధవారం పర్యటిస్తున్నారు. కుప్పంలోని గంగమాంబ జాతరకు సతీసమేతంగా విచ్చేస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో బుధవారం పర్యటిస్తున్నారు. కుప్పంలో జరుగుతోన్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శన పూజలు నిర్వహించనున్నారు. ఇందులో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొంటారు.
బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 9.30 గంటలకు శాంతిపురం మండలం గణేషపురం సమీపంలోని న్యాక్ వద్ద హెలిపాడ్కు చేరుకుంటారు.
అక్కడి నుంచి పీఈఎస్ వైద్య కళాశాలకు చేరుకొని విశ్రాంతి తీసుకుంటారు.
అనంతరం 10.30కు భువనేశ్వరితోసహా కుప్పం పట్టణంలోని గంగమాంబ ఆలయానికి బాబు చేరుకుంటారు.
ఉదయం 10.45 గంటలకు అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుని, తిరిగి బెంగుళూరు మీదుగా విజయవాడకు వెళతారు.
అమ్మవారి జాతరలో పాల్గొనేందుకు నారా భువనేశ్వరి మంగళవారం రాత్రి కుప్పం చేరుకున్నారు.
బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చిన ఆమెకు టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికాయి. అనంతరం ఆమె పీఈఎస్ వైద్య కళాశాల అతిథి గృహానికి చేరుకున్నారు.
ఇక, సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం రాత్రి కుప్పం చేరుకుని, గంగమాంబను దర్శించుకున్నారు.
అనంతరం బందోబస్తు, ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం సీఎం కుప్పం రానున్న నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ చేరుకున్నట్లు సమాచారం.