ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సీఎం జగన్ తీపి కబురు
కేబినెట్ సమావేశంలో వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది..
ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేల ఆర్థిక సాయం చేయనున్నారు. ఆగష్టు 12న ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం.
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
భోగాపురం, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి మంత్రి వర్గం ఓకే చెప్పింది.. రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కేబినెట్లో చర్చించారు.
విభజన హామీల్లో భాగంగా రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. కేంద్ర నిధుల సాధన కోసం ప్రయత్నిస్తూనే.. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మించాలని.. మొదటి దశలో పోర్టుకు రూ.4,736 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఆగష్టు నాటికి టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం సూచించారు.. అలాగే టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపాలన్నారు.
ఇక కేబినెట్ సమావేశంలో వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. మరోవైపు గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలపై కేబినెట్ సబ్కమిటీ సీఎం జగన్కు నివేదిక అందజేయగా.. కేబినెట్లో చర్చించారు. ఫైబర్ నెట్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించారు. ఇక ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు.