అంబులెన్స్ పబ్లిసిటీ చెత్తబండి రియాలిటీ… నారా లోకేష్ ఘాటు విమర్శలు

ఇటీవలే జగన్ వెయ్యికి పైగా అంబులెన్స్ సర్వీసుల్ని రాష్ట్రంలో ప్రారంభించారు. కానీ ఓ రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మాత్రం ఒక్కటంటే ఒక్క అంబులెన్స్ కూడా రాలేదు.
పశ్చిమగోదావరి జిల్లాలో అనారోగ్యానికి గురైన వ్యక్తిని చెత్తబండిలో తరలించడంపైన సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు.
ఓటేసిన పేదలు అనారోగ్యానికి గురైతే.. చెత్తబండిలో ఏపీ సర్కారు దవాఖానాకా? అని ఏపీ సర్కారును ఆయన ప్రశ్నించారు.
గద్దెనెక్కిన పెద్దలకి కరోనా సోకితే ప్రత్యేక విమానంలో పక్క రాష్ట్రాల కార్పొరేట్ ఆస్పత్రులకా? ఇదెక్కడి పాలన అంటూ నారా లోకేష్ నిలదీశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో అంబులెన్స్కి కాల్ చేసినా స్పందించకపోవడంతో.. చెత్తబండిలో అనారోగ్యానికి గురైన వ్యక్తిని తరలించడం బాధాకరమన్నారు.
పబ్లిసిటీ అంబులెన్స్ అయితే రియాలిటీ చెత్తబండి అయిందని లోకేష్ తప్పుబట్టారు.
తాజాగా ఈ ఘటనపై వైసీపీ ఎంపీ రఘురామ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంతూరిలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు.
తన ప్రజలకు క్షమాపణలు కూడా కోరుతున్నానని తెలిపారు ఎంపీ. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం భీమవరం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఊరి బస్టాప్ లో రెండు రోజుల నుంచి అనారోగ్యంతో ఓ వ్యక్తి బాధపడుతున్నాయి. అయితే కరోనా వైరస్ భయంతో ఎవరూ అతని దగ్గరికి కూడా పోలేదు.
కొందరు 108 కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతో ప్రైవేట్ అంబులెన్సులకు కూడా ఫోన్ చేసారు.
కానీ ఏ ఒక్క అంబులెన్స్ కుడా స్పందించలేదు. దీంతో చివరికి అతడ్ని చెత్త బండిలో ఆకివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం ఏలూరుకు తరలించారు.
ఈ ఘటనపైనే ఇప్పుడు సర్వత్రా అధికారుల వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కొత్తగా 1088 అంబులెన్సులు ప్రారంభించిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా అత్యాధునిక కోవిడ్ 19 బస్సులు ఇప్పటికే రాష్ట్రంలో సేవలందిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కోసం కనీసం ఒక్క అంబులెన్స్ కూడా రాకపోవడం ఏంటని ప్రతిపక్షాలతో పాటు.. పలువురు ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు.