‘అమరావతి’పై ఎందుకింత రభస..? -కె.విజయ శైలేంద్ర, ఆంధ్రభూమి

Andhra Pradesh Vidhan Sabha constituency map

క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ)ని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ అథారిటీ పరిధిలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని చాలా ప్రాంతాలు వస్తాయి. ఇదంతా అమరావతి రాజధాని ప్రాంతమే. గనుక ఇక్కడే రాజధాని ఉంటుందనేది నిశ్చితంగా చెప్పవచ్చు. ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి వైకాపాకు జనం పట్టం కట్టారంటే, చంద్రబాబు రాజధానిని ఎంపిక చేసుకున్న తీరును వారు తిరస్కరించినట్లే.

మూడు పంటలు పండే 29 గ్రామాల్లోని సారవంతమైన ప్రాంతాన్ని రాజధానిగా టీడీపీ ఎంపిక చేయడం చారిత్రక తప్పిదమే.

అమరావతి ప్రాంతంలో సామాన్యుడు కొనుగోలు చేసే స్థాయిలో భూముల ధరలు లేవు. వాస్తవానికి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా స్థలాల ధరలు ఉండాలి. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది.

భవిష్యత్తులో మహానగరం వస్తుందంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, భూముల యజమానులు కుమ్మక్కై గజం రేటును రూ.50వేలకు పైగా నిర్ణయించారు. హైదరాబాద్, చెన్నై శివార్లలో కూడా ఈ రేట్లు లేవు. అపార్టుమెంట్లలో ఫ్లాట్ల రేటు కూడా అంతే.

రాజధాని అంటే గుంటూరు, కృష్ణా జిల్లాలకే పరిమితం కాదు. రాజధాని మనందరిదీ అనే మానసిక భావనను కల్పించలేకపోయారు.

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చి అమరావతిలో ఎవరైనా స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయగలరా?

రాజధాని అంటే కరెన్సీ నోట్ల మార్పిడి కేంద్రమా? ఐశ్వర్యవంతులకు నిలయమా? అనే ఆగ్రహం ప్రజల్లో కలిగింది.

ఈ రోజు టీడీపీ నేతలు చేస్తున్న హడావుడి వల్ల ప్రచారం రావచ్చునేమో కాని, ప్రజలు హర్షించడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అమరావతిలో రాజధాని నిర్మాణం ఇంకా చేపట్టలేదు. భవిష్యత్తులో 10 నుంచి 15 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వస్తే పరిస్థితి ఏమిటనే విషయమై చర్చ జరుగుతోంది. పైగా నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుంది.

అందుకే సీఆర్‌డీఏ పరిధిలో గట్టినేల ఉన్న చోట రాజధానిని నిర్మిస్తే తప్పేమీ లేదు.

ఇక సినిమా సెట్టింగ్‌ల మాదిరి రాజధానిలో బహుళ అంతస్థుల భవనాలు అక్కర్లేదు.

అసెంబ్లీ, హైకోర్టుతో కలిపి ఒక డజను పరిపాలన భవనాలు చాలు.

గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా రిక్రూట్‌మెంట్ జరిగేది. కేవలం పోలీసులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల రిక్రూట్‌మెంట్ మాత్రమే ఇపుడు జరుగుతోంది. టెక్నాలజీ వల్ల చాలా పనులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అవసరం ఉన్న వాళ్లు తప్ప సామాన్య ప్రజలకు సచివాలయంతో పని ఉండదు.

రాజధానిని ఎంత గొప్పగా నిర్మించినా ఉద్యోగులు మాత్రం గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరిలోనే ఉంటూ అక్కడి నుంచి వస్తారు. సెక్రటేరియట్‌కు సమీపంలో ఎందుకుంటారు? వారికి వసతి సదుపాయాలు కల్పించినా, పిల్లల చదువులు, వైద్య సదుపాయాల నిమిత్తం అక్కడ ఉండరు. ఉదయం ఆఫీసుకు వచ్చి సాయంత్రం వెళ్లే ఉద్యోగుల కోసం రాజధాని నిర్మించరు.

ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్‌పైన నియామకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

వేలాది మంది కంప్యూటర్ ఆపరేటర్లు, సెక్షన్ ఆఫీసర్లు, ఆఫీసు అసిస్టెంట్లు, అటెండర్లను నియమించే సాహసం ప్రభుత్వం చేస్తుందా? అంత ఆర్థిక స్థాయి ప్రభుత్వానికి ఉందా?

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ అవసరం. హైదరాబాద్‌లో చేసిన తప్పిదం పునారవృతం కారాదు.

ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనిని ఇపుడు జగన్ చేసి చూపిస్తారని జనం భావిస్తున్నారు.

పరిపాలన వికేంద్రీకరణ వల్ల అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సంతోషిస్తారు.

కర్నూలు లేదా తిరుపతిలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడం, అసెంబ్లీని నిర్మించడం మంచిది. దీని వల్ల అమరావతిపై వత్తిడి తగ్గుతుంది.

చరిత్రలో మనకు అన్నీ చిన్న చిన్న సంస్థానాలే ఉండేవి. రెండువేల ఏళ్ల క్రితం శాతావాహనుల రాజధానిగా అమరావతి ఉండేది. వరదల వల్ల వారు అమరావతి నుంచి రాజధానిని మార్చారని చరిత్రాకారులంటారు.

రాజధాని అనేది అన్ని వర్గాల ప్రజల కోసం నిర్మించాలి.

అరగంట నుంచి గంటన్నర ప్రయాణిస్తే వెళ్లే గుంటూరు, మంగళగిరి, తెనాలి, విజయవాడ, ఏలూరు, గుడివాడ లాంటి పట్టణాలు ఉన్న చోట మహానగరంగా అమరావతి అవతరించడం దుర్లభం. ఇది ఒక అందమైన కల మాత్రమే.

రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసం అన్ని హంగులతో పరిపాలనా భవనాలు, హైకోర్టు,అసెంబ్లీ భవనాలు, మంత్రులు, న్యాయమూర్తులు, అధికారులకు నివాస భవనాలు నిర్మిస్తే సరిపోతుంది.

దీనికి 34వేల ఎకరాల మాగాణి భూములను సేకరించారు.

రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ బ్రోకర్లకు, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు, నడమంత్రపుసిరితో రాత్రికి రాత్రి ధనవంతులు కావాలనే ఆశబోతులకు, గ్యాంబ్లింగ్ సంస్కృతికి నిలయంగా ఉండరాదు. స్టాక్ మార్కెట్‌లోలాగా ఉదయం పెట్టుబడి పెట్టి, సాయంత్రానికి లాభాలు దండుకునే కేంద్రంగా అమరావతి మారకుండా చూడాలి.

ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ పెరిగింది. చివరకు బజారుకు వెళ్లి పాదరక్షలు కొనుగోలు చేసే ఓపిక కూడా జనానికి లేకుండాపోయింది. అన్నీ ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. కొరియర్ సంస్థలు తెల్లారేసరికల్లా హోమ్ డెలీవరీ చేస్తున్నారు.

రాజధాని అంటే పాత సినిమాల్లో మాదిరిగా లేకపోతే మహానగరాల్లో మాదిరిగా బంగారు బజారు, గాజుల బజారు, బ్యాంకుల బజారు, హోల్‌సేల్ కిరాణా బజారు, టెక్స్‌టైల్ బజార్లు వంటివి ఉంటాయనే భ్రమలకు లోనై రంగుల చిత్రం ఆవిష్కృతమవుతుందని జనం భావించారు. ఊహాజనితమైన రంగుల ప్రపంచానికి, వాస్తవానికి చాలా తేడా ఉంది.

కోట్లాది రూపాయలు కుమ్మరించి విదేశీ రాజధానులను తలదనే్న భవనాలు నిర్మించాలన్న ఆలోచననే ముమ్మాటికీ తప్పు.

ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో జారుకుంటోంది. ఈ పరిస్థితుల్లో అప్పులుచేసి పరిపాలనా భవనాలను నిర్మించాల్సిన అవసరం లేదు.
వౌలిక సదుపాయాలను కల్పించవచ్చు.

సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కరవు ప్రాంతాలకు సాగునీటిని ఇవ్వాలి.

అమరావతి రాజధాని ప్రాంతం నుంచి విజయవాడ ఆవల ఉన్న గన్నవరం విమానాశ్రయానికి వెళ్లాంటే ఇప్పటికీ రెండే రెండు వంతెనలు దిక్కు.

గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క వంతెన కూడా నిర్మించలేకపోయింది.

దీని వల్ల విజయవాడ నగర ప్రజలు వీఐపీల తాకిడితో ట్రాఫిక్‌లో తరచుగా చిక్కుకుంటున్నారు.

ప్రభుత్వం తలుచుకుంటే మూడేళ్లలో కృష్ణా నదిపై వంతెన నిర్మింవచ్చు.

రాజధానిపై జగన్ ప్రభుత్వం అభూతకల్పనలకు చెక్ పెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *