ఒక్క రోజే 264 కేసులు.. 88కి పెరిగిన మరణాలు..ఏపీలో కరోనా ఉగ్రరూపం

ఏపీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. మంగళవారం ఒక్కరోజే 264 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల బులెటిన్ విడుదల చేయగా, మొత్తం 264 కేసులు నమోదయ్యాయి.
వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 193 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 44 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 27 మంది ఉన్నారు.
రాష్ట్రానికి సంబంధించిన వివరాలను గమనిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 15,911 మంది శాంపిల్స్ పరీక్షించగా 193 మంది కోవిడ్ 19 పాజిటివ్గా తేలారు.
81 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
దీంతో రాష్ట్రంలో మొత్తం 5,280 కేసులు నమోదు కాగా, 2851 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో 2,341 మంది చికిత్స పొందుతున్నారు.
అలాగే కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 88కు పెరిగింది.
అలాగే పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 6,720 కేసులు నమోదయ్యాయి.